ఈ ఏడాది ప్రథమార్థంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. అయితే ఎలాగైనా తన తదుపరి సినిమాతో హిట్ కొట్టాలని భావించిన బాలకృష్ణ, గత ఏడాది తనకు జై సింహ వంటి మంచి సినిమా అందించిన దర్శకుడు కేస్ రవికుమార్ కే తన తదుపరి సినిమా బాధ్యతలు అప్పగించారు. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా సినిమానే రూలర్.
నేడు ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం ఒక మోస్తరు టాక్ తో ముందుకు నడుస్తోంది. ఇక సినిమా గురించి చెప్పాలంటే, ఒక రొట్ట రొటీన్ పాత కథని సినిమా కోసం ఎంచుకున్న దర్శకుడు కె.ఎస్ రవికుమార్, దానిని ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడంలో పూర్తిగా విఫలమయ్యారని మెజారిటీ ప్రేక్షకులు అంటున్నారు. కథ ఎంత పాతదైనప్పటికీ, దర్శకుడు దానికి కొత్తదనాన్ని జోడించి తీయవచ్చని, అయితే ఆ విషయంలో కేఎస్ రవికుమార్ ఏ మాత్రం ఆలోచన చేసినట్లు లేదని మెజారిటీ ప్రేక్షకులు సినిమా పై పెదవి విరుస్తున్నారు.
ముఖ్యంగా సినిమాలోని కొన్ని సీన్స్ చూస్తే గతంలో వచ్చిన చాలా సినిమాలను పోలినట్లు ఉన్నాయని అంటున్నారు ముఖ్యంగా సినిమాలో బాలయ్య నటన, యాక్షన్, డైలాగ్స్, డాన్స్ వంటివి మాత్రమే ప్రత్యేకతను చాటుకున్నాయని, అవి తప్పించి సినిమాలో మరేమీ లేదని కూడా వారంటున్నారు. ఇతర సినిమాలు కూడా పోటీగా రిలీజ్ అయిన ఈ పరిస్థితుల్లో ఓవరాల్ గా పర్వాలేదనిపించే టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో గట్టెక్కడం కొంత కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఈ సినిమాతో బాలయ్య రాబోయే రోజుల్లో ఎంతవరకు బాక్సాఫీస్ ని రూల్ చేస్తారో చూడాలి...!!