ఏ మూహూర్తంలో కేంద్రం పౌరసత్వ బిల్లు తెరపైకి తీసుకు వచ్చారో.. అప్పటి నుంచి దేశం అట్టుడికి పోతుంది. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిబెంగాల్, ఢిల్లీల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ చట్టం లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నిరసనగా వామపక్షాల నేతృత్వంలోని ఎర్రకోట దగ్గర నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా.. దీనికి అనుమతి నిరాకరించిన పోలీసులు... ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అయినా నిరసనకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు... ఎర్రకోట వద్దకు వేలాది మంది చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎక్కడ చూసినా రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి, నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విడిచిపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ-గుర్గావ్ హైవేపై వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది... ఇక, నిరసన కార్యక్రమాలు ఎక్కువగా మెట్రో రైళ్లను ఉపయోగించడాన్ని గుర్తించిన అధికారులు.. ఢిల్లీవ్యాప్తంగా 20 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈ నిరసనలపై ప్రముఖులు రక రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. సమస్యకి హింస పరిష్కార మార్గం కాకూడదు. జాతి, సమగ్రత, ఐక్యతని దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా శాంతియుతంగా ఉండాలి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హింస బాధ కలిగిస్తుంది. భారత ప్రజలు సహోదరభావం కలిగిన వారు అని.. కొన్ని విషయాల్లో సంయమనం పాటిస్తే బాగుంటుందని అన్నారు.
ప్రజలంతా శాంతియుతంగా ఐక్యతతో ఉండాలని కోరుతున్నాను అని రజనీకాంత్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో ‘దర్భార్’ సంక్రాంతికి ముస్తాబవుతుంది. తాజాగా రజినీకాంత్ రజనీకాంత్ తన 168వ సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ శివ తెరకెక్కిస్తుండగా, ఇందులో కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా కీలక పాత్రలలో కనిపించనున్నారు.