మెగాస్టార్ చిరంజీవిని అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబును ఓకే వేదికపై చూడాలనుకున్న అభిమానుల కల నెరవేరనుంది. మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ప్రీ రీలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా చిరంజీవి రానున్నాడు. రెండు రోజుల క్రితమే ఈవార్త బయటికి రాగ తాజాగా మహేష్ బాబు అధికారికంగా ప్రకటించాడు. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రీ రిలీజ్ వేడుకకు రావడానికి అంగీకరించిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. మీతో కలిసి వేదిక పంచుకోబోతున్నందుకు చాలా సంతోషం గా వుంది. ఆక్షణాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.
జనవరి 5 న సాయంత్రం 5:04గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో ఈవేడుక జరుగనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రెండు రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి11 న విడుదలకానుంది.ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేసింది. అయితే ఇప్పటి వరకు మూడు పాటలు విడుదలకాగా అవి మాత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. కానీ నాల్గో సాంగ్ మాత్రం అదరగొడుతుందని టాక్. అతి త్వరలో ఈ సాంగ్ విడుదలకానుంది.