జూనియ‌ర్ ఎన్టీఆర్ః టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత.. ఇలా వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమలో పాత రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఓ వైపు హిట్ల మీద హిట్లు కొడుతూనే తన మార్కెట్‌ను కూడా అమాంతం పెంచేసుకున్నాడు. పలు వ్యాపార ప్రకటనలు, కొన్ని ఛానళ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా చేస్తూ బిజీ అయిపోయాడు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేయడం జూనియర్ ఎన్టీఆర్ అలవాటు. కానీ 2019లో మాత్రం ఈయన ఒక్క సినిమా కూడా చేయలేదు. అరవింద సమేత తర్వాత పూర్తిగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఈ ఏడాది రాజమౌళి సినిమాతో జాయిన్ అయ్యాడు. అప్పట్నుంచి ఇదే సినిమాపై ఫోకస్ చేసాడు. 2020లో రాజమౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత 2019 బాకీని వరస సినిమాలతో భర్తీ చేయడానికి చూస్తున్నాడు యంగ్ టైగర్.

 

అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో కెరీర్ మొదలుపెట్టినప్పట్నుంచి ఇఫ్పటి వరకు ఒక్క కాలెండర్ ఇయర్ కూడా మిస్ చేయలేదు బన్నీ. ప్రతీ ఏడాది కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేస్తూ ప్రేక్ష‌కుల‌ను త‌న వంతు అల‌రిస్తూనే ఉన్నాడు. కానీ 2019లో మాత్రం అది కుదర్లేదు. ఈయన నుంచి ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రాలేదు. నా పేరు సూర్య తర్వాత భారీ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ అల వైకుంఠపురములో మొదలుపెట్టాడు బన్నీ. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఇక సుకుమార్ సినిమా కూడా వచ్చే ఏడాది రానుంది. 

 


పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కనిపించలేదు. ఎన్నికలు, రాజకీయాలతో బిజీ అయిపోయాడు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా ఈయన సినిమాల వైపు చూడలేదు. జనాల మధ్యకి వెళ్లి సమస్యలపై పోరాడుతున్నాడు జనసేనాని. ఇన్నాళ్లకు మళ్లీ పింక్ సినిమా రీమేక్ తో పవన్ రాబోతున్నాడని తెలుస్తుంది. డిసెంబర్ లోనే ఈ చిత్రం మొదలు కానుంది. పవన్ ఫిబ్రవరిలో సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు.  మ‌రి ఈ చిత్రం గురించి కూడా అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్‌మెంట్ అయితే ఎక్క‌డా లేదు. 

 

మనోజ్ మంచు ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. ఈ ఏడాది విడాకులు తీసుకున్న మనోజ్.. మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేస్తున్నాడు. వరస సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. 

 

సుధీర్ బాబు గతేడాది సమ్మోహనం లాంటి సినిమాతో విజయం అందుకున్న సుధీర్ బాబు ఆ తర్వాత వీరభోగ వసంతరాయలు సినిమా చేసాడు. ఈ చిత్రం డిజాస్టర్. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సినిమాలేవీ చేయలేదు సుధీర్ బాబు. ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో `వి` సినిమా చేస్తున్నాడు. ఇందులో నాని విలన్ గా నటిస్తుంటే.. సుధీర్ హీరో. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

 

 సుశాంత్ అక్కినేని మేనల్లుడు సుశాంత్ కూడా 2019లో కనిపించలేదు. గతేడాది ఈయన చిలసౌ సినిమాతో పర్లేదనిపించాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ మాయం అయిపోయాడు. ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు సుశాంత్.

 

నితిన్ వ‌రస సినిమాలు చేస్తున్నాడు. కానీ ఒక్కటి కూడా విడుదల చేయలేకపోయాడు నితిన్. ఈ ఏడాది భీష్మ సినిమాతో రావాలనుకున్న కూడా కుదర్లేదు. దాంతో శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం భీష్మ. రంగ్ దే, చదరంగం సినిమాలతో బిజీగా ఉన్నాడు నితిన్. కాని ఇది వ‌ర‌కంత ఊపుమీద లేడు కెరియ‌ర్ కాస్త డ‌ల్ అయింది. 

 

అల్లరి నరేష్ 2019లో మహర్షి సినిమాలో మహేష్ స్నేహితుడిగా నటించాడు నరేష్. కానీ హీరోగా మాత్రం ఈయన కనిపించలేదు. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన నరేష్.. గత రెండేళ్లుగా అస్సలు ఆ జోరు చూపించలేదు. ప్రస్తుతం ఒకటి అరా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు అల్లరోడు.

 

నారా రోహిత్ ఒక‌ప్పుడు ఏడాదికి అరడజన్ సినిమాలు చేసిన నారా రోహిత్ కి గ‌త కొద్ది రోజులుగా సినిమాలు లేవు.  ఈయన సినిమాలు కనీసం సెట్స్ పైకి కూడా రావడం లేదు. 2020లో కూడా నారా రోహిత్ నుంచి సినిమాలు ఊహించడం కష్టమే. 

 

రవితేజ మాస్ రాజా రవితేజ మరోసారి భారీ గ్యాప్ తీసుకున్నాడు. 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు ఈయన. డిస్కో రాజా డిసెంబర్ లోనే రావాల్సి ఉన్నా కూడా జనవరి 24కి పోస్ట్ పోన్ చేసారు. దర్శక నిర్మాతలు. దాంతో ఈ ఏడాది ఖాళీగా మిగిలిపోయింది.

 

ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నాగేశ్వరరావు పాత్రలో నటించాడు సుమంత్. ఇది మినహా 2019లో ఈయన సినిమాలేవీ లేవు. గతేడాది సుబ్రమణ్యపురం, ఇదమ్ జగత్ సినిమాలు చేసిన సుమంత్.. ఈ ఏడాది మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: