ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ హిట్ తో తన కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తన తదుపరి సినిమాని రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో తీస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఛార్మితో కలిసి తన పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై తెరకెక్కించనున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయాలని పూరి భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక హిందీలో ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శక,నిర్మాత కరణ్ జోహార్ నిర్మించనున్నట్లు టాక్. 

 

ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవర్ఫుల్ యువకుడిగా కనపడనున్నాడని, అలానే ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారని టాక్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదటగా దివంగత నటి శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ పేరు గట్టిగా వినపడింది. అందులోను ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ మాట్లాడుతూ, విజయ్ యాక్టింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం అని, తన ప్రక్కన నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తానని కూడా చెప్పడంతో, జాన్వీ ఫైటర్ లో నటించడం ఖాయం అని వార్తలొచ్చాయి. 

 

ఇక నేడు ఈ సినిమాలో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల హీరోయిన్ కియారా అద్వానీ ఎంపికైనట్లు ఫిలిం నగర్ వర్గాల్లో మరొక వార్త హల్ చల్ చేస్తోంది. మొన్నటి వరకు జాన్వీ అని, ఇప్పుడేమో కియారా అని వీరిద్దరి పేర్లు విపరీతంగా ప్రచారం అవుతుండడంతో, అసలు వీరిద్దరిలో ఎవరు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తారో అనే దానిపై అందరిలోనూ ఎంతో సస్పెన్స్ నెలకొంది. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో పూర్తి నిజానిజాలు తెలియాలంటే ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటన చేయాల్సిందే......!!  

మరింత సమాచారం తెలుసుకోండి: