నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్, సి.కల్యాణ్ కాంబినేషన్లో విజయం సాధించిన చిత్రం `జైసింహా`. ఇదే కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రమే`రూలర్`. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతమందించాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ చిత్రం డిసెంబర్ 20న విడుదల అయింది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ``రూలర్ సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్.
ఓ మంచి ప్రయత్నం చేశాం. మా ప్రయత్నానికి విజయాన్ని అందించారు ప్రేక్షకులు. కల్యాణ్గారు ఖర్చుకు ఎక్కడా కాంప్రైజ్ కాలేదు. కల్యాణ్గారితో నేను చేసిన మూడో సినిమా. మంచి కథా విలువలున్న సినిమా చేయాలని భావించే నిర్మాత ఆయన. ఆయనకు నా తరపున, అభిమానుల తరపున కృతజ్ఞతలు.`` తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్, వేదిక, రాంప్రసాద్, అదుర్స్ రఘు తదితరులు పాల్గొన్నారు. అయితే వాస్తవానికి రూలర్ సినిమా కేవలం బాలయ్య అభిమానులను, బీ,సీ సెంటర్ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని సీన్స్ రాసుకుని బండి లాగించాడు. అంతేకాదు ఈ సినిమా చూస్తుంటే.. బాలకృష్ణ పాత సినిమాలనే అటు ఇటు మార్చి తీసినట్టు ఉంటుంది.
మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా రెండో రోజుకే చాలా థియేటర్ల నుంచి లేపేసి.. ప్రతిరోజూ పండగే చిత్రానికి థియేటర్లు ఇస్తున్నారు. కానీ.. బాలయ్య మాత్రం ప్రెస్ మీట్ పెట్టి రోలర్ సూపర్ హిట్ అని చెప్పుకోవడం నిజంగా కామెడీ అనే చెప్పాలి. కాగా, సినిమా మొదటి భాగం పర్వాలేదు అనిపిస్తే రెండవ భాగం మొత్తానికే తేలిపోయింది. మొత్తానికి బాలయ్య గత రెండు చిత్రాలు ఎన్టీఆర్ బయోపిక్ నిరాశ పరచడంతో ‘రూలర్’ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే ‘రూలర్’ సినిమాకి మిక్డ్స్ టాక్ రావడంతో ఫ్యాన్స్ను నిరాశ పరిచిందనే చెప్పాలి.