తెలుగు బుల్లితెరపై ఎంతో మంది మహిళా యాంకర్లు వచ్చారు.. మంచి పాపులారిటీ సంపాదించారు. చాలా తక్కువ మంది మగవారు యాంకర్లుగా వచ్చారు. ఇటీవల కాలంలో యాంకర్ ప్రదీప్ తనదైన సమయస్ఫూర్తితో టీవీ వ్యాఖ్యాతగా రాణిస్తూ పిన్న పెద్ద తేడా లేకుండా ఎంతోమంది ప్రేక్షకుల గుండెల్లో చోటు మంచి చోటు సంపాదించాడు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పుట్టిన ప్రదీప్.. హైదరాబాద్లోని విజ్ఞాన్ కాలేజి లో బీటెక్(ఈఈఈ) పూర్తి చేసుకుని ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో చేరాడు. అదే సమయంలో రేడియో మిర్చిలో రేడియో జాకీగా ఉద్యోగం సంపాదించి బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతూ వచ్చాడు.
కెరీర్ బిగినింగ్ లో ‘కొంచెం టచ్లో ఉంటే చెప్తా’ కార్యక్రమంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి నంది అవార్డును అందుకున్నారు. ఇక 'ఢీ' షో లో సుడిగాలి సుధీర్తో చేసే కామెడీ, పంచ్లు బాగా పండి అమ్మాయిల్లో ప్రదీప్ కు విపరీతంగా క్రేజ్ పెరిగింది. ఆ మద్య ప్రదీప్ తో స్వయంవరం కార్యక్రమం వచ్చింది. అయితే ఈ కార్యక్రమంపై కొన్ని విమర్శలు వచ్చాయి. టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన, కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించాడు. గత కొంత కాలంగా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కొంతకాలంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు.
వాస్తవానికి గతంలో ప్రదీప్ హీరోగా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొన్ని రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఆ సినిమా ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఆగిపోయిందట. ఆ సమయంలో ప్రదీప్ చాలా డిప్రేషన్ కి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం తనదైన యాంకరింగ్ చేస్తూ ఈ సారి ఆయన ఎలాంటి పొరపాటు జరక్కుండా మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడని అంటున్నారు. ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన యువకుడు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. ఈసారైనా ఈ యంగ్ యాంకర్ హీరోగా తెరపై కనిపించి సక్సెస్ సాధిస్తాడా అన్నది చూడాలి.