149 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి తరువాత సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లారు. రాజకీయాల్లో ఏడేళ్లు ఉన్న మెగాస్టార్ కు రాజకీయాలు అంతా ఈజీ కాదు అని అర్ధం చేసుకున్నారు. అనంతరం మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ విజయం తరువాత మెగాస్టార్ చారిత్రాత్మక నేపధ్యం కలిసిన సైరా సినిమా చేశారు.
సైరా నరసింహా రెడ్డి ఒక ప్రాంతానికి చెందిన ఫ్రీడమ్ ఫైటర్. పైగా అయన చరిత్ర గురించి బయటి ప్రపంచానికి తెలియకపోవడంతో ఈ సినిమా బాలీవుడ్లో రిలీజ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. బాలీవుడ్ లో వందకోట్లు వసూలు చేస్తుంది అనుకుంటే కేవలం రూ. 5 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. కథ ప్రాంతీయంగా ఉంటె సినిమాను పాన్ ఇండియా మూవీ గా మార్కెట్ చేసుకోవడం కష్టం.
అమితాబ్ లాంటి నటులు సినిమాలో ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తెలుగు భాషలో మాత్రమే ఈ సినిమా విజయం సాధించడం విశేషం. మిగతా భాషల్లో సినిమా ఫెయిల్ అయ్యింది. దీనిని దృష్టిలో పెట్టుకొని మెగాస్టార్ .. కొరటాల కాంబినేషన్లో వస్తున్న 152 వ సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో కథను సిద్ధం చేసుకున్నారు. ఈ కథకు అనుగుణంగా స్క్రిప్ట్ వర్క్ ను కూడా కొరటాల సిద్ధం చేసుకున్నారు.
కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ముగిసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నది. హిందూ దేవాలయాలను నిర్లక్ష్యం చేస్తే దాని వలన కలిగే అనర్ధాలను గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. దేవాలయాలకు సంబంధించిన కథ కావడంతో ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.