రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్తో పాటు బాలీవుడ్ లోనూ లార్జర్దెన్ లైఫ్ చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడటం, మార్కెట్ స్థాయి కూడా పెరగడంతో మేకర్స్ ముందుకొస్తున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ఖాన్ నటించిన దంగల్ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నితీష్ తివారి త్వరలో మహా భారతాన్ని తెరపైకి తీసుకు రాబోతున్నారంటూ గత కొన్ని రోజలుగా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే మధు మంతెన రామాయణ, మహాభారతాలని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారని అనుకుంటున్నారు..
ఇకపోతే రెండు భాగాలుగా మహా భారతాన్ని నిర్మించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆయన ఇందు కోసం నటీనటుల ఎంపికను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరపైకి రానున్న ఈ చిత్రంలో ద్రౌపదిగా దీపికా పదుకోన్ నటించడానికి అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
హృతిక్ రోషన్ కృష్ణుడిగా కనిపిస్తారని చెబుతున్నారు. ఇంతకు ముందు ఈ పాత్రలో ఆమీర్ఖాన్ నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం మాత్రం కృష్ణుడిగా హృతిక్ రోషన్ నటిస్తారని సమాచారం.
ఇక ద్రౌపది, శ్రీకృష్ణుడి చుట్టే మహాభారతం తిరుగుతుంది కాబట్టి ఆ కీలక పాత్రల కోసం హృతిక్, దీపిక అయితేనే క్రేజ్ వుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఆ కారణంగానే వారిని ఎంపిక చేయబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక అన్నీ సవ్యంగా కుదిరితే మహాభారతం తొలి భాగాన్ని 2021 దీపావళి నాటికి మొదలుపెట్టే అవకాశాలు వున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే మరో మహాభారతాన్ని మనందరం మళ్ళీ తెరపై త్వరలో చూడబోతున్నమని తెలుస్తుంది..