నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది మూడు సినిమాల్లో నటించాడు. అందులో ఒకటి హీరోగా కాగా మరో రెండు సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు. ప్రస్తుతం ఈ హీరో ఫ్యామిలీ డ్రామా ప్రధానంగా తెరకెక్కుతోన్న `ఎంత మంచివాడవురా` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌కుడు. స‌తీష్ వేగేశ్న‌.. ఈ పేరు కంటే కూడా శ‌త‌మానం భ‌వతి ద‌ర్శ‌కుడు అంటే ఈజీగా గుర్తు ప‌ట్టేస్తారు ప్రేక్ష‌కులు. శతమానం భవతి చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో  మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

 

ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. ఇక ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 5న లేదా జనవరి 6న జరిగే ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా ఎన్టీఆర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. కథలో హీరో తనకు తెలియకుండానే విలన్స్ కి మంచి చేస్తాడట, దాంతో కొన్ని సమస్యలు వస్తాయని.. ఆ సమస్యలను హీరో ఎలా సాల్వ్ చేసాడనేది సినిమా కథ అని తెలుస్తోంది. 

 

కాగా, సుహాసిని, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జనవరి 15 న విడుద‌ల చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఈసారి సంక్రాంతి బడా సినిమాలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇలాంటి సీజన్ లో కళ్యాణ్ రామ్ చాలా ధైర్యంగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.  సంక్రాంతి బరిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇందులో మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములో మ‌రియు రజినీకాంత్ దర్బార్ చిత్రాలు విడుద‌ల కానున్నాయి. ఇలా బడా సినిమాలు లైన్లో ఉన్నా కానీ ధైర్యంగా కళ్యాణ్ రామ్ ముందుకురావ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: