నందమూరి నట వారసుడు ఎన్టీఆర్. మాస్ ఆడియన్స్లో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న తారక్ డేట్స్ కోసం ఆది సినిమా నుండే టాప్ డైరెక్టర్లు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం త్వరలో రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నాడని తాజా సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటన్న చర్చ ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది. కొద్ది రోజులుగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ ఎన్టీఆర్కు కథ కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలోను ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్, నిర్మాత కేయల్ నారాయణ బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ ఇమేజ్ను మ్యాచ్ చేసే స్థాయిలో కొత్త దర్శకుడు సినిమాను రూపొందించగలడా అని చర్చ జరుగుతోంది. ఇక కేయల్ నారాయణ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఎన్టీఆర్ కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది. వరుస బ్లాక్ బస్టర్ సక్సస్ ల తో యంగ్ టైగర్ మంచి ఫాంలో ఉన్నాడు. దీనికి తోడు ఆర్ఆర్ఆర్తో జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితిల్లో కొత్త దర్శకుడితో సినిమా అంటే ప్రయోగం చేయటమే అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఈ ప్రయోగం గనక బెడిసికొడితే తారక్ స్థాయి ఎక్కడికి పడిపోతుందోనన్న మరో టాక్ కూడా వినిపిస్తుంది.