సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ పనిలో బిజీ అయిపొయింది. అందులో భాగంగానే ఇప్పటికే సినిమా నుంచి నాలుగు పాటలను, టీజర్ విడుదల చేశారు. ఇక ఈ చిత్ర టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, హరితేజ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు సినిమాలకు యూఎస్ లో ఉండే క్రేజే వేరు. ఈ హ్యాండ్ సమ్ హీరో చిత్రాలకు అక్కడ డిమాండ్ ఎక్కువే అని చెప్పాలి. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రం పై కూడా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ సినిమా టికెట్ ధర భారీగా ఉందట. 20 నుండి 21 డాలర్ల వరకు సరిలేరు నీకెవ్వరు టికెట్ ధర నిర్ణయించారని తెలుస్తోంది.
అలాగే మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మిలిటరీ మేజర్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న విడుదల అవ్వనుంది. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని ఎమోషన్స్ ఉండేలా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇక ప్రమోషన్స్లో భాగంగా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ను జనవరి 5న సాయంత్రం హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో గ్రాండ్గా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు.