టాలీవుడ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా ప్రతిరోజు పండగే, మొన్న 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల దర్శకుడు మారుతీ దర్శకత్వం వహించగా, ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. గీత ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమాలో సత్యరాజ్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, 

 

రావురమేష్, విజయ్ కుమార్, నరేష్, ప్రభ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక తొలిరోజు తొలిఆట నుండి మంచి టాక్ సంపాదించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో, పలు ఎంటర్టైన్మెంట్ అంశాలను కలగలిపి తెరకెక్కబడింది. సినిమాలో కొద్దిపాటి లోపాలు ఉన్నప్పటికీ, చాలా వరకు సినిమాలోని కథ, కథనాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో మెజారిటీ ప్రేక్షకులు దీనికి భారీగా కలెక్షన్ ని అందిస్తున్నారు. ఇకపోతే మన తెలుగు సినిమాకు భారీ కలెక్షన్స్ సంపాదించే అడ్డాగా పేరున్న నైజాం ఏరియాలో ఇప్పటికే ప్రతిరోజు పండగే సినిమా రూ.7.30 కోట్లు కలెక్ట్ చేసి దూసుకుపోతోంది. కాగా గతంలో తేజ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సుప్రీం సినిమా రూ.8.50 కోట్లు వసూలు చేసింది. 

 

ఇక ప్రస్తుతం ప్రతిరోజు పండగే కలెక్షన్స్ ని బట్టి చూస్తుంటే, మరొక వారం రోజుల్లో సుప్రీం ఓవర్ అల్ కలెక్షన్ ని దాటేసేలా ఉందని, దాని తరువాత నుండి సినిమాకు అన్ని కూడా లాభాలేనని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే కేవలం నైజాం మాత్రమే కాదు, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమాగా ఇదే విధంగా దూసుకుపోతున్నట్లు చెప్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమాలేవీ కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడం కూడా దీనికి ఇంత బాగా కలెక్షన్స్ ని సంపాదించడానికి ఒక కారణంగా వారు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: