తమిళం లో సూపర్ హిట్ అయిన వీఐపీని తెలుగులో రఘువరన్ బీటెక్ గా డబ్ చేసి 2015జనవరి 1 న విడుదలచేసింది ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా హిట్ అనిపించుకుంది. ప్రమోషన్స్ లేకపోవడం వల్ల సినిమా ప్రేక్షకుల కు చేరలేకపోయింది లేకపోతే సూపర్ హిట్ అయ్యేదే. ఈచిత్రం తోనే ధనుష్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు. ఈ సినిమా తరువాత ధనుష్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయినా ఏ ఒక్కటి కూడా విజయాన్ని సాధించలేకపోయింది.
ఇక ఇప్పుడు ధనుష్ మరో సారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్, ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'ఎన్నైనొక్కి పాయుమ్ తూటా'. ఇటీవల కోలీవుడ్ లో విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ రివ్యూస్ ను రాబట్టుకొని బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైయింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో డబ్ చేసి వచ్చే ఏడాది జనవరి 1 న విడుదలచేస్తున్నారు. మరి ఈ సినిమాకు కూడా న్యూ ఇయర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. శివ సంగీతం అందించిన ఈచిత్రంలో మేఘా ఆకాష్ కథానాయికగా నటించగా
ప్రముఖ నటుడు శశి కుమార్ ముఖ్య పాత్రలో నటించాడు.
ఇక ధనుష్ ప్రస్తుతం దొరై సెంథిల్ కుమార్ డైరెక్షన్ లో పటాస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర విలన్ గా నటిస్తుండగా మెహ్రీన్ హీరోయిన్. ప్రముఖ నటి స్నేహ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదలకానుంది.