వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు సామాన్యం. కాని, వాటిని సరిచేసుకున్నప్పుడే సంబంధబాంధవ్యాలు సరవుతాయి. ఇక చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరు మాత్రం అలాగే దశాబ్ధాల పాటు కలిసుంటున్నారు కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. సినీ తారల ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లు ప్రజలకు ఎప్పుడూ ఆసక్తికరమే. ముఖ్యంగా ఆయా సినీ తారల అభిమానులకు అయితే ఇదో పండుగ. మరి 2019లో సిపీ ప్రముఖులు ఎవరెవరు వివాహాలు చేసుకున్నారు.. ఎవరెవరు విడాకులు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ తమిళ నటుడు ఆర్య, హీరోయిన్ సయేషా ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలస్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సినీ నటి అర్చన పారిశ్రామికవేత్త జగదీశ్ను పెళ్లాడారు. నవంబర్ 14న వివాహ బంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. అలాగే వంశీ తెరకెక్కించిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, గ్రీన్ సిగ్నల్, ఓ స్త్రీ రేపు రా లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన మనాలి రాథోడ్ ఈ ఏడాది వివాహం చేసుకుంది. హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ ఈ ఏడాది పెళ్లి చేసుకుంది. తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ సరసన మెరిసిన రిచా అమెరికాలో తన సహవిద్యార్థిని పెళ్లిచేసుకుంది.
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు బాబీ రెండో పెళ్లి చేసుకున్నారు. నీలు షా పెళ్లి జూన్లో జరిగింది. రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రెండో వివాహం చేసుకుంది. పారిశ్రామికవేత్త, నటుడు విషగన్ వణంగాముడిని సౌందర్య వివాహం చేసుకుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడు, గాయకుడు సాగర్ వివాహం జూన్ 19న హైదరాబాద్లో జరిగింది. మౌనికను సాగర్ పెళ్లిచేసుకున్నారు. ప్రముఖ టీవీ నటి సమీరా షెరిఫ్ వివాహం సినిమా నటి సన కుమారుడు సయ్యద్ అన్వర్తో నవంబర్ 11న జరిగింది. అన్వర్ కూడా టీవీ ఆర్టిస్టే. తమిళ సీరియల్స్లో ఆయన నటిస్తున్నారు.
ఇక విడాకుల విషయానికి వస్తే.. శ్వేతా బసు ప్రసాద్ 2018 లో తన స్నేహితుడు రోహిత్ మిట్టల్ ని వివాహమాడింది. అయితే శ్వేతా కనీసం ఏడాది అయినా గడవక ముందే విడాకులు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే 21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్. పరస్పర అంగీకారంతో అర్జున్ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు తీసుకున్నారు. మంచు మనోజ్ 2015లో ప్రణతిరెడ్డితో వివాహం జరిగింది. మూడేళ్లలోనే మూడుముళ్ల బంధానికి మంచు మనోజ్ ముగింపు పలికారు.