టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సూపర్ స్టార్ కృష్ణ గారి సరసన కిలాడీ కృష్ణుడు అనే సినిమా ద్వారా నటిగా పరిచయం అయ్యారు విజయశాంతి. ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిన ఆమె, వాటిని సద్వినియోగం చేసుకుని మంచి హిట్స్ దక్కించుకున్నారు. అప్పట్లో దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించిన విజయశాంతి, కొన్నేళ్ల తరువాత రాజకీయరంగంలోకి ప్రవేశించారు. ఇక అప్పటినుండి రాజకీయాల్లోనే కొనసాగిన ఆమె, ఇటీవల దాదాపుగా కొన్నేళ్ల సుదీర్ఘ విరామం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మళ్ళి నటిగా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఆమెను ఒప్పించడానికి చాలారోజులుగా ప్రయత్నిస్తున్నానని, 

 

రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్న ఆమె, ఎట్టకేలకు సరిలేరు నీకెవ్వరులోని భారతి అనే క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారని, ఈ సినిమా తప్పకుండా ఆమెకు మంచి కం బ్యాక్ మూవీ అవుతుందని కొద్దిరోజుల క్రితం ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పడం జరిగింది. ఇక నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నేడు దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి విజయశాంతి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి తన అనుభవాలను ఇంటర్వ్యూ లో పంచుకున్న విజయశాంతి, గతంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన నుండి గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. విషయం ఏమిటంటే, మహేష్ బాబు బాలనటుడిగా అతడితో కలిసి తాను నటించిన కొడుకు దిద్దిన కాపురం సినిమా షూటింగ్ సమయంలో, ఒక సీన్ లో భాగంగా తాను మహేష్ బాబును చెంపదెబ్బ కొట్టవలసి ఉందని,

 

అయితే ఎన్ని టేక్ లు అయిపోతున్నా, తాను మాత్రం మహేష్ ని కొట్టలేకపోయానని అన్నారు. చివరికి హీరో కృష్ణ గారు తన వద్దకు వచ్చి, ఇప్పటికే చాలా టెక్ లు అయిపోయాయి, ఇకనైనా మహేష్ ని కొడతారా లేదా అంటూ అడిగారట. అలానే మహేష్ కూడా, మేడమ్ మీరు కొట్టకపోతే సీన్ పండదు, నేనేమి అనుకోని కొట్టండి అని చెప్పడంతో చివరికి చెంపదెబ్బ కొట్టానని, ఆ సీన్ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని విజయశాంతి గుర్తు చేసుకోవడం జరిగింది. ఇక ఎంత ఎదిగినప్పటికీ వొదిగి ఉండే మహేష్ బాబు, నేడు సూపర్ స్టార్ గా కొనసాగుతున్నప్పటికి, తండ్రి కృష్ణ గారి వలె అందరితో కలుపుగోలుగా మాట్లాడుతారని, అలానే సెట్ లోని వారందరికీ ఎంతో గౌరవం ఇస్తారని ఆమె అన్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: