మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ మంచి రోజు చూసి ఆ మధ్య కొబ్బరికాయ కొట్టి షూటింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ప్రి ప్రొడక్షన్స్ పనులు ఇన్ని రోజులు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి ఆరంభమైంది. ఓ సెట్లో హైదరాబాద్ శివార్లలో వేశారు అక్కడ బాస్(చిరంజీవి) అడుగుపెట్టారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అయితే మెగాస్టార్ షూటింగ్లో అడుగుపెట్టిన రోజునే చిత్ర బృందం సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ను ఫ్యాన్స్కు తెలిపింది. మూవీ యూనిట్ ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడని అధికారికంగా ప్రకటించింది. ఇక ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
దీంతో చిరు-మణిల కాంబో సంగీత ప్రియుల్ని మరోసారి మైమరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో లీకువీరులు అందించిన సమాచారం ప్రకారం మెగాస్టార్ సరసన త్రిష నటించనుందని సమాచారం. అంతేకాకుండా చిత్ర బృందం ఐటమ్ సాంగ్ కోసం రెజీనాను సంప్రదించగా ఆమె తిరస్కరించిందని టాలీవుడ్ టాక్. అయితే రెజీనా టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలో అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా వృథా చేసుకుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఈ ఐటమ్ సాంగ్ను మాస్ ఆడియన్స్ ఊగిపోయే రీతిలో మణిశర్మ కంపోజ్ చేశారని కూడా తెలుస్తోంది.
డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని.. ఈ చిత్రాన్ని తనదైన రీతిలో కాన్సెప్ట్ బేస్డ్తో పాటు మాస్ ఓరియెంటెడ్గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో చిరు చాలా హుందాతనం కలిగిన రోల్ కావడంతో ఈ పాత్రకు తగ్గట్లుగా రెడీ అవ్వడానికి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో ఓ ఫోటో చిరు లుక్ ఇదేనంటూ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇక దేవాదాయ శాఖ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు.. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘గోవిందాచార్య’ మరియు ‘గోవిందా హరి గోవిందా’ ‘ఆచార్య’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే మూవీ టైటిల్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.