మరోసారి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)లో అభిప్రాయబేధాలు  బయటపడ్డాయి.  హైదరాబాద్‌లో గురువారం జరిగిన ‘మా’ డైరీ అవిష్కరణ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది.  చిరంజీవి, మోహన్‌బాబు రాజశేఖర్‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్‌ సభలో పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి  మైకు లాక్కోవడంతో వివాదం తలెత్తింది. రాజశేఖర్ చిరంజీవి వ్యాఖ్యలపై  అభ్యంతరం తెలిపారు. మొదటగా సభలో చిరంజీవి ఈ విధంగా మాట్లాడారు  .. ‘మా’లో మంచి ఉంటే మైక్‌లో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెబుదాం అని సముదాయించే ధోరణిలో చెప్పారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  రాజశేఖర్  చిరంజీవి వ్యాఖ్యలపై నిరసనగా వేదికపైకి వచ్చి అక్కడ ఉన్నవారి కాళ్లకు నమస్కారం చేస్తూ.. ఆ సమయంలో మాట్లాడుతున్న పరుచూరి నుంచి మైకు లాక్కున్నారు. చిరంజీవి చెప్పిన అంశాలను తప్పుబట్టారు. రాజశేఖర్‌  చెప్పేది ఒకటి.. చేసేది మరోకటి అంటూ సినీ పెద్దలపై రుసరుసలాడారు. ఇండస్ట్రీలో అగ్గి రాజేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తన కారు ప్రమాదానికి ‘మా’ పరిస్థితే కారణమని ఆరోపించారు. 

 

దీనిపై స్పందించిన  రాజశేఖర్ ను ఉద్దేశించి చిరంజీవి.. ఆయన చెప్పిన మాటలకు విలువెక్కడుందని  ప్రశ్నించారు. రాజశేఖర్ ప్రవర్తనను తప్పుబడుతూ, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. అదే సమయంలో వేదిక దిగి వెళ్లిపోయిన రాజశేఖర్‌.. మళ్లీ వచ్చి ‘మా’ పై తాను మాట్లాడింది అంతా నిజమేనని గట్టిగా మాట్లాడారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి.. రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజశేఖర్‌ ఈ కార్యక్రమాన్ని  పథకం ప్రకారమే  రసాభాస సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం రాజశేఖర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి..  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు సినీ పరిశ్రమ అభివృద్ధికి హామీ ఇచ్చారని తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్దికి  ముఖ్యమంత్రులను సరైన ప్రణాళికతో కలుద్దామని చెప్పారు.అంతకుముందు గురువారం హైదరాబాద్‌లో  ‘మా’  నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మా డైరీ-2020’ తొలి ప్ర‌తిని ఆవిష్క‌రించి రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజుకు అందించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, మోహన్‌బాబు, రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్‌, జీవిత, రాజశేఖర్‌ దంపతులు, నరేష్‌, రాజా రవీంద్ర, జయసుధ, హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అందరి అడ్రస్‌లు డైరీలో ఉన్నాయి. పేద కళాకారులకు సహాయ, సహకారాలు అందించాలి. అందుకోసం అందరు అగ్ర హీరోలను కలుస్తా’ అని తెలిపారు.

 

 కొద్దికాలంగా మా అధ్యక్షుడు నరేశ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ రోజు జరిగిన కార్యక్రమంలో సినీ పెద్దల సమక్షంలో మూవీ అసోసియే‍న్‌లో భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్‌ మాట్లాడిన అంశాలపై కాకుండా.. ఆయన ప్రవర్తించిన విధానంపై చాలా మంది ఖండిస్తున్నారు. సినీ పెద్దలపై రాజశేఖర్‌ నేరుగా కామెంట్లు చేయడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: