ఇండియన్ స్క్రీన్ పై భారీ సినిమాలు రావడం ఈ మధ్య బాగా పెరిగిందనే చెప్పాలి. వీటికి ఇండియాలో ఓ దారి చూపింది మాత్రం బాహుబలి సినిమా అని చెప్పాల్సిందే. ఈ సినిమా సాధించిన విజయంతో మంచి కథను భారీ కాన్వాస్ లో చెప్పడానికి ఎవరూ వెనుకాడడం లేదు. ఇప్పుడలాంటి భారీ కథాంశంతో దర్శక దిగ్గజం మణిరత్నం ఓ బహుభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

 

 

ఎన్నో కథలను గొప్ప చిత్రాలుగా తెరకెక్కించి హృద్యంగా తెరకెక్కించిన ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’ తీయాలని ఎప్పటినుంచో కలలు కంటున్నారు. మొత్తానికి ఆయన కల సాకారం కావడానికి తొలి అడుగు పడింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి అఫీషియల్ గా ప్రకటించింది. బంగారు వర్ణం కత్తి ఉన్న పోస్టర్ లో ఇంగ్లీష్ అక్షరాలతో చిత్రం టైటిల్ ఉంది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా చారిత్రక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వెండితెరపై ఓ చారిత్రక ఘట్టాన్ని చూడటానికి మీరు సిద్ధమా అని వాల్ లో రాసుకుంది యూనిట్.

 

 

ఈ సినిమాలో భారీ తారాగణం నటించనుంది. ఆతిత్య కరికలన్ గా విక్రమ్, నందిని, మందాకిని అనే ద్విపాత్రల్లో ఐశ్వర్యారాయ్, కుందువాయిగా త్రిష.. ఇంకా జయం రవి, కార్తీ ముఖ్యపాత్రల్లో ఈ సినిమా పాన్ ఇండియా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ తన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: