టాలీవుడ్ లో కొంత కాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న ‘మా’ లొల్లి నిన్న తీవ్ర రూపం దాల్చింది. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి లో ఏగొడవైనా చెవిలో చెప్పండి.. మంచి అయితే మైక్ ముందు చెప్పండి అనే ఉద్దేశ్యంతో మాట్లాడారు. ఎందుకంటే కొంత కాలంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పరుచూరి బ్రదర్ మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి నటుడు డాక్టర్ రాజశేఖర్ మైక్ తీసుకొని ఇక్కడ మాట్లాడుతుంది ఒకటీ.. జరిగేది మరొకటి అని.. మా గొడవల వల్లో మా ఇంట్లో ప్రతిరోజూ గొడవలు జరుగుతున్నాయి.. నా బెంజ్ కారు కూడా పోయిందని.. ఇక్కడ పెద్దలు పేరుకు మాత్రమే ఉన్నారని అంటూ తన ఆవేశాన్ని వెల్లగక్కారు. ఒకరకంగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి వర్సెస్ రాజశేఖర్ అన్నట్టుగా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్ బాబులు సైతం ఆగ్రహానికి గురయ్యేలా రాజశేఖర్ ప్రసంగించారు. ఆ తర్వాత రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేసిన కాసేపటికే ఆయన తన రాజీనామ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా దీనిపై ‘మా’ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శివాజీరాజా తీవ్రంగా స్పందించారు. నిన్న జరిగిన పరిణామాలు చాలా దురదృష్టకరం. చిరంజీవి సహా పెద్దలందరూ వేదికపై ఉండగా ఇలా జరగడం బాధగా అనిపించింది. పెద్దలను పిలిచి సభను రసాభాస చేయడమే కాకుండా అవమాన పరిచారు. మేం చేసిన పనులపై నిందలు వేశారు. అవన్నీ తప్పుడు లెక్కలుగా తేలిన తర్వాత క్షమాపణలు కూడా చెప్పలేదు.
నేను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించడం లేదని.. ఇలాంటి జరిగినపుడు వారే ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. ఇక డాక్టర్ రాజశేఖర్ నిజంగా చాలా ఎమోషనల్ పర్సన్..ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు. గతంలో ‘మా’ కి పదిలక్షల విరాళం ఇచ్చినా చెప్పుకోలేదు. అలాంటి వ్యక్తి నిన్న ఎందుకు అలా ఎమోషన్ కి గురయ్యారో అర్థం చేసుకోవాలి. కొంత కాలంగా అధ్యక్షులుగా అసోసియేషన్కు నరేష్గారు ఎంత ఫండ్ తెచ్చారో చెప్పాలి. అంతే కాదు.. దాతలు విరాళాలు ఇస్తామని ముందుకు వస్తే వడ్డించిన విస్తరని కాలితో తన్నారు. ఇలాంటి అధ్యక్షుడు ఉండటం చాలా దురదృష్టకరం అన్నారు శివాజీరాజా.