సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఐదు సాంగ్స్, టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో, అలానే మహేష్ ఫ్యాన్స్ లో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. రేపు ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో వైభవంగా జరగనుండగా, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. ఇక ఈ స్పెషల్ ఈవెంట్ కోసం అప్పుడే ఏర్పాట్లు భారీ స్థాయిలో మొదలయినట్లు తెలుస్తోంది. 

 

ఇకపోతే ఈ సినిమా తెరకెక్కుతున్న బేస్ పాయింట్ ఎలా ఉంటుంది అనే దానిపై ఒక వార్త నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమాలో మెయిన్ గా దేశానికి కాపు కాసే సైనికులు, దేశం పైకి ఎటువంటి శత్రుమూకల దాడి జరుగకుండా తమ ప్రాణాలొడ్డి ఎంతో కష్టపడుతుంటే, మన దేశంలో కొందరు వారిని అపహాస్యం చేయడంతో పాటు అర్ధం పర్ధం లేకుండా ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారని, నిజానికి అటువంటి వారిని బోర్డర్ అవతల పడేసి దేశభద్రత కోసం కాపుకాయమంటే సైనికులు పడే కష్టాలు ఏంటో అర్ధం అవుతుందనే పాయింట్ పై ఈ సినిమా తెరకెక్కుతోందట. 

 

దానితో పాటు దేశానికి విధేయుడై ఉండడం అంటే జనవరి 26, ఆగష్టు 15 వంటి వేడుకలు చేసుకోవడం కాదు, దేశం కోసం నిజమైన రీతిన త్యాగం చేయడం అనే సందేశం కూడా ఈ సినిమాలో ఉండనుందట. అయితే ఈ మేసేజ్ కు పలు కమర్షియల్ హంగులు జోడించి మహేష్ ఫ్యాన్స్, ప్రేక్షకులు మెచ్చేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే ఈ నెల 11న ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: