టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట చిన్న నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్, ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటిస్తూ ముందుకు సాగాడు. దాదాపుగా అప్పట్లో చాలా సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటించిన బండ్ల గణేష్, మెల్లగా తన ఆస్తులు కూడా పెంచుకున్నాడు. ఇక ఆ తరువాత ఒక్కసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్ అనే సినిమాని నిర్మించిన బండ్ల, ఆ సినిమాతో భారీ ఫ్లాప్ ని అందుకున్నాడు. 

 

అయితే కొన్నాళ్ల అనంతరం మరొక్కసారి పవర్ స్టార్ తోనే గబ్బర్ సింగ్ సినిమాను తీసిన బండ్ల, ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ తో టెంపర్ వంటి హిట్ సినిమాని కూడా తీసాడు. బన్నీ తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే తీసినప్పటికీ అవి సక్సెస్ కాలేదు. ఇక తరువాత నిర్మాణ రంగానికి దూరమై ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి, అప్పట్లో టిఆర్ఎస్ ఓడిపోతుంది, పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుందని, లేకపోతే తన గొంతు బ్లేడ్ తో కోసుకుంటానని ఆయన సంచలన ఛాలెంజ్ చేయడం జరిగింది. 

 

కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి టిఆర్ఎస్ గెలవడంతో మీడియా నుండి తప్పించుకున్నారు బండ్ల. ఇక మళ్ళి చాలా గ్యాప్ తరువాత ప్రస్తుతం మహేష్, అనిల్, రావిపూడి ల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్న బండ్ల, ఆ సినిమాలో ఒక దొంగ పాత్రలో నటిస్తున్నట్లు నిన్న దర్శకుడు అనిల్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పారు. సినిమాలో నోట్లో బ్లేడ్ పెట్టుకుని దొంగతనాలు చేసే బండ్ల, ఆఖరికి రైలును దోచుకోవడానికి హీరో తో పాటు రైలు ఎక్కుతాడని, అలానే ట్రైన్ ఎపిసోడ్ లో అందరికీ విపరీతంగా నవ్వులు పంచుతాడని, తప్పకుండా సినిమాలో ఆయన క్యారెక్టర్ కు మంచి పేరొస్తుందని అన్నారు అనిల్. ముందుగా నటుడిగా, ఆ తరువాత నిర్మాతగా, ఆపై రాజకీయ నాయకుడిగా, మళ్ళి ఇప్పుడు ఆఖరికి రైలు దోపిడీకి సిద్దమైన దొంగగా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న బండ్ల గణేష్, ఈ సినిమా ద్వారా ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడా చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: