నిన్న రాత్రి, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేకంగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు పై అలానే సినిమా దర్శక నిర్మాతలు, నటీనటుల పై మంచి ప్రశంసలు కురిపించారు. తనకు మహేష్ అంటే మంచి అభిమానం అని, తండ్రి కృష్ణ గారి వలె మహేష్ కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం కలవాడని అన్నారు. ఇక ఇటీవల ఒక పేపర్ తిరగేస్తున్న సమయంలో తనకు మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా పోస్టర్ కనపడిందని, దానిని చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోయానని, మహేష్ అందం గురించి కాసేపు ఛలోక్తులు విసిరారు మెగాస్టార్. 

 

ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని తాను భావిస్తున్న సమయంలోనే మహేష్ నుండి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తనకు ఆహ్వానం రావడం, వెనువెంటనే తాను ఒప్పుకోవడం జరిగిందని అన్నారు. కెరీర్ తొలి నాళ్లలో కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు అని అందరూ అనే వారని, అయితే ప్రస్తుతం మహేష్ బాబు, తండ్రి కృష్ణ గారు అనే పొజీషన్ కు మహేష్ ఎదిగారని అన్నారు. ఇక అలానే తనకు సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పిన మెగాస్టార్, ఇండస్ట్రీలో సరికొత్త తరహా పద్దతులను ముందుగా ప్రవేశపెట్టిన కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. తన కెరీర్ లో దాదాపుగా 350 సినిమాల్లో హీరోగా నటించిన కృష్ణ గారికి, కెరీర్ పరంగా దక్కవలసిన గౌరవం మాత్రం దక్కలేదని తాను ఎప్పుడూ భావిస్తుండేవాడినని, 

 

నిజానికి కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి తీరాలని తన తరపున డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు మెగాస్టార్. ఇక ఈ సినిమా ట్రైలర్ ని వీక్షించిన మెగాస్టార్, ఈ ట్రైలర్ ని బట్టి చూస్తుంటేనే సినిమా హిట్ అవుతుందని అర్ధం అవుతుందని, అలానే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో పలు కమర్షియల్ హంగులు జోడించి దీనిని తెరకెక్కించినట్లు స్పష్టం అవుతుందని అన్నారు. అలానే కొన్నేళ్ల తరువాత సినిమాల్లోకి నటిగా రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతితో కాసేపు సరదాగా గత స్మృతులు గుర్తు చేసుకున్న మెగాస్టార్, ఈ సినిమా ఆమెకు మంచి కం బ్యాక్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: