టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘బాహుబలి, బాహుబలి2’ మూవీస్ తెరకెక్కించారు దర్శకధీరుడు రాజమౌళి. కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా అపజయం అనేదే తెలియకుండా తనదైన మార్క్ చాటుకుంటున్నారు రాజమౌళి. బాహుబలి 2 మూవీ తర్వాత మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు మన్యం వీరుడు కొమురంభీమ్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఇక ఆంధ్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నారు. ఈ మూవీ ఇద్దరు హేమా హేమీలు అయిన మన్యం వీరుల పోరాట స్పూర్తితో తీయబోతున్నట్లు రాజమౌళి తెలిపారు. చరిత్రలోని రెండు పాత్రల మధ్య జరిగిన ఓ కల్పిత కథతో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. సినిమా ముహూర్తం మొదలు పెట్టి చాలా కాలం అయినా.. ఇప్పటి వరకు ఎలాంటి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని లీకేజీలతో సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో అన్న విషయం తెలిసింది.
అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్, ఒలీవియా,అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ జూలై 30,2020న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీమ్గా నటిస్తున్న ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి ఓ విప్లవ గీతాన్ని గద్దర్ రాసి స్వయంగా ఆలపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అఫిషియల్ వార్తలు బయటకు రాలేదు.