తెలుగు లో వస్తున్న పాపులర్ కామెడీ షో జబర్ధస్త్ ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతున్నా ఏమాత్రం రేంజ్ తగ్గడం లేదని అంటున్నారు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై కామెడీ కేరాఫ్ అడ్రస్ ఏదీ అంటే వెంటనే 'జబర్దస్త్' అంటున్నారు. 'జబర్దస్త్' పరిచయం అయిన కొంత మంది కమెడియన్లు ప్రస్తుతం వెండితెరపై జోరు కొనసాగిస్తున్నారు. వేణు, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, శకలక శంకర్, సుధీర్, గెటప్ శీను.. ఇలా మరికొంత మంది సినిమాల్లో కూడా తనదైన కామెడీ మార్క్ చాటుకుంటున్నారు. అయితే 'జబర్దస్త్' ఏడేళ్లుగా జడ్జీగా వ్యవహరిస్తూ వచ్చిన నాగబాబు ఇటీవల ఈ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయారు. జీ తెలుగు నిర్వహిస్తున్న‘అదిరింది’ కామెడీ ప్రోగ్రామ్ కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.
నాగబాబు తో ఎప్పటి నుంచి అనుబంధం ఉన్న కొంత మంది కమెడియన్లు కూడా ఆయన వెంట వెళ్లారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర, ఆర్ పీ లాంటి టీమ్ లీడర్లు ఉన్నారు. దాంతో ఇక 'జబర్దస్త్' పని అయ్యిందని.. మరికొంత మంది కూడా అదిరింది షో కి వెళ్లిపోతారని తెగ రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే జబర్ధస్త్ కాపీ పేస్ట్ లా అదిరింది ప్రోగ్రామ్ సాగుతుంది.. ఈ నేపథ్యంలో 'జబర్దస్త్' .. 'అదిరింది' కార్యక్రమాలను పోల్చి చూడటం జరుగుతోంది. కాకపోతే నాగబాబు బయటికి వెళ్లిన తరువాత 'జబర్దస్త్' షోకి ఎంతమాత్రం రేటింగ్ తగ్గకపోవడం విశేషం. ఇక నాగబాబుతోనే మొదలైన 'అదిరింది' రేటింగ్ పరంగా జబర్దస్త్ కి చాలా దూరంగానే ఉండిపోతోంది.
అంతే కాదు అదిరింది షో లో పాత జబర్ధస్త్ కమెడియన్లు వేణు, ధన్ రాజ్ లాంటి వారు ఎంట్రీ ఇచ్చారు.. కానీ కామెడీ ఏమాత్రం పండించలేకపోతున్నారని టాక్ వినిపిస్తుంది. దాంతో రేటింగ్ లో 'జబర్దస్త్' దూసుకు వెళ్తుంది. మరో ట్విస్ట్ ఏంటంటే.. 'అదిరింది' ప్రసారమయ్యే సమయానికి 'జబర్దస్త్' పాత ఎపిసోడ్స్ లో కొంత భాగాన్ని ఎడిట్ చేసి .. హైలైట్స్ ను ప్రసారం చేస్తున్నారు. దాంతో చాలా మంది పాత కార్యక్రమం అయినా.. జబర్ధస్త్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు కార్యక్రమాలు పోటీ వాతావరణంలో ప్రసారమవుతున్నాయి.