టాలీవుడ్ లో పటాస్ మూవీతో మొదలు పెట్టి మొన్నటి ఎఫ్ 2 వరకు తనదైన కామెడీ మార్క్ చాటుకుంటున్నారు దర్శకుడు అనీల్ రావిపూడి. చేసిని కొన్ని సినిమాలే అయినా అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ దర్శకుడితో ఓ సినిమా తీయాలని పెద్ద హీరోలు సైతం అనుకుంటున్నారంటే.. మనోడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటించిన మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ మద్య ఎల్బీనగర్ స్టేడియంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. 'సరిలేరు నీకెవ్వరు' ఈ నెల 11వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిగారు రావడం నా అదృష్టం. నా గురించి ఆయన మాట్లాడిన నాలుగు మాటలు నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? అలాగే ఆయనతో సినిమా చేయాలని నాకూ వుంది. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ.. ఆయన పాటలకు డ్యాన్సులు వేస్తూ పెరిగానని.. అలాంటిది ఆయనతో సినిమా అంటే ఏ దర్శకుడికైనా పండుగే అని అన్నారు.
చిరంజీవిగారు ఓకే చెబితే ఎగిరిగంతేస్తాను. మూడు నెలలలో మంచి కథను సిద్ధం చేస్తాను అన్నాడు. ఆయన ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి. ఇక సరిలేరు నీకెవ్వరు మూవీ గురించి మాట్లాడుతూ.. దేశభక్తి .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ కథ, కావాల్సినంత వినోదాన్ని కలుపుకుని సాగుతుంది. ఈ కథలో ఫ్యాక్షనిజం ఉందనే ప్రచారం జరిగింది.. కానీ అసలు ఫ్యాక్షన్ కి ఏ సంబంధం లేదు అని అన్నారు.