టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కిలాడీ కృష్ణుడు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన విజయశాంతి, ఆ తరువాత మెల్లగా అవకాశాలు అందుకుంటూ నటిగా ముందుకు సాగారు. ఆ తరువాత నుండి అప్పటి స్టార్ హీరోలందరి సరసన కూడా నటించి హీరోయిన్ గా అగ్ర పథాన నిలిచిన విజయశాంతి, ఆ తరువాత కొన్నాళ్ళకు రాజకీయ రంగ ప్రవేశం చేసి, తల్లి తెలంగాణ అనే పార్టీని నెలకొలిపారు. అనంతరం తన పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసిన విజయశాంతి, అక్కడి నుండి ఇప్పటివరకు పూర్తిగా సినిమాలకు విరామం పలికి రాజకీయాలకే అంకితం అయ్యారు. 

 

కాగా ఎట్టకేలకు ఇన్నేళ్లకు ఆమె మళ్ళి సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో నటిగా ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు మిలిటరీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు సినిమా యూనిట్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో విజయశాంతి మాట్లాడుతూ, దర్శకుడు అనిల్ గారు చెప్పిన కథ, అలానే అందులోని తన పాత్ర నచ్చడంతో సినిమాకు ఒప్పుకున్నానని, అలానే హీరోగా మహేష్ బాబు నటిస్తుండడంతో తప్పకుండా ఈ సినిమా చేయలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. 

 

ఇక ఈ ఐదు నెలల షూటింగ్ సమయంలో తనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయని, ముఖ్యంగా దర్శకుడు అనిల్ ఐదు నెలల పాటు పెట్టిన నరకం ఎప్పటికీ మరిచిపోలేనని కొంత సరదాగా ఆమె వ్యాఖ్యానించారు. ముందుగా తనకు కావలసిన సన్నివేశాన్ని అనిల్ గారు చేసి చూపిస్తారని, ఆ తరువాత తాను అనుకున్న ఫీల్ వచ్చే వరకు మాత్రం వదిలిపెట్టరని ఆమె సరదాగా చెప్పడం జరిగింది. ఇక ఈ ఇంటర్వ్యూ లో విజయశాంతితో పాటు మహేష్ బాబు, రష్మిక, దేవిశ్రీప్రసాద్, దర్శకుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు..... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: