సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం ఈ నెల 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చత్రాన్ని దిల్ రాజు సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ప్రీ రిలీజ్ టాక్ కూడా పాజిటివ్గానే ఉండటంతో దర్శక నిర్మాతలు కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. అయితే రొటీన్ యాక్షన్ డ్రామా కావడం ఒక్కటే సరిలేరు నీకెవ్వరు సినిమాకు మైనస్ అయ్యేలా ఉందని ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ఐదు సార్లు సంక్రాంతి బరిలో దిగాడు. టక్కరిదొంగ (2002), ఒక్కడు (2003), బిజినెస్ మేన్ (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), 1-నేనొక్కడినే (2014) సినిమాలు సంక్రాంతి బరిలో దిగాయి. అయితే వీటిలో `టక్కరిదొంగ`, `1-నేనొక్కడినే` మినహా మిగిలిన మూడు చిత్రాలు కూడా కమర్షియల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ మూడు చిత్రాల్లోనూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. కట్ చేస్తే… ఈ సంక్రాంతి కానుకగా వస్తున్న మహేష్ `సరిలేరు నీకెవ్వరు`లోనూ ప్రకాష్ రాజ్ విలన్ గా దర్శనమివ్వనున్నాడు.
మరి ఈ సెంటిమెంట్ రిపీట్ అయి.. మహేష్, ప్రకాష్ కాంబినేషన్ లో మరో సంక్రాంతి హిట్ చేరుతుందేమో చూడాలి. కాగా, ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, అజయ్, బండ్ల గణేష్, సంగీతలు కీలకపాత్రల్లో నటించారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే జనవరి 5న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. మరోవైపు మహేష్ బాబు చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ చిత్రానికి సంబందించిన స్పెషల్ షోస్ అర్ధరాత్రి ఒంటిగంట నుండి ప్రదర్శించనున్నారు.