సూపర్ స్టార్ మహేష్ బాబు.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. తన కెరీర్ లో తొలిసారిగా మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో లేడి అబితాబ్ విజయశాంతి ఈ చిత్రం ద్వారా సినిమాల్లోకి పునరాగమనం చేశారు.
ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలతో థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే.. ఓ లేడీ ప్రొఫెసర్ను ఇబ్బంది పెట్టే ఓ మంత్రికి బుద్ధి చెప్పడం.. అది కూడా ఆ ప్రొఫెసర్ కుమారుడు ఆర్మీలో చనిపోతే ఆ ప్లేస్లోకి హీరో ఎంట్రీ ఇవ్వడమే కథ. అయితే ముందుగా మంచి ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ ని నడిపించిన దర్శకుడు అనిల్, సెకండ్ హాఫ్ లో కూడా మహేష్ తో అవసరం ఉన్నా, లేకున్నా కొన్ని కామెడీ డైలాగ్స్ చూపించాడు.
అయితే అనిల్ రావిపూడి అంటే కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉంటుందనే టాగ్ లైన్ ని తెచ్చేసుకున్నాడు. అయితే ఈ సినిమా ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. కామెడీ లేదు అని కాదు ఉంది , కానీ తన గత సినిమాల రేంజ్ లో లేదు, అంతలా నవ్వించలేకపోయాడు కూడాను. అనిల్ కలానికి కాస్త ఈ సినిమాకు వచ్చే సరికి బుర్రలో గుజ్జు తగ్గిందో లేదో పెన్నులో పదును తగ్గిందో కాని కామెడీ రేంజ్ కూడా తగ్గింది. ఉందా అంటే ఉంది.. బాగుందా అంటే బాగుంది అనేలా లేదు.. ఏదోలా కామెడీ ఉంది. మొత్తంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ వరకు ఓ ట్రైన్ ఎపిసోడ్ కామెడీతో లాగించేసినా సెకండాఫ్లో కథ, కథనాల రివీల్ చేసే టైంలో మాత్రం తేలిపోయాడు. మరి ఈ సినిమా ఎంత వరకు హిట్ కొడుతుందో చూడాలి.