మన తెలుగువాళ్లందరికీ లభించిన గౌరవంగా అనిపించింది.''ఒక మనిషి గ్యాప్‌ తీసుకున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటాడు. సింపుల్‌ విషయాలే కావచ్చు కానీ గొప్ప విషయాలు తెలుసుకుంటాడు. ఇంక లైఫ్‌లో  గ్యాప్‌ తీసుకోకూడదనే గొప్ప విషయం తెలుసుకున్నాను. ఒకటిన్నర సంవత్సరం సినిమా లేకపోయినా నా విషయంలో ఫ్యాన్స్‌ కనపర్చిన ప్రేమ మర్చిపోలేనివి. గ్యాప్‌ నేను ఫీల్‌ కాకుండా చేసింది నా ఫ్యాన్సే. నన్ను ప్రేమించే వ్యక్తులు ఇంతమంది ఉన్నారనే విషయం ఈ గ్యాపే తెలియజేసింది. అంతేకాదు.. అందరికీ ఫ్యాన్స్‌ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంటారనే విషయం నాకు తెలియజేసింది'' అని అల్లు అర్జున్‌ అన్నారు.
అల్లు అర్జున్‌ హీరోగా నటించిన సినిమా 'అల.. వైకుంఠపురములో'. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌  పతాకాలపై అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఆదివారమే ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా అల్లు అర్జున్‌  మీడియాతో  జరిపిన సంభాషణ విశేషాలు.

 

ఇది బాలీవుడ్‌ ఫిల్మ్‌ 'సోను కే టిటు కీ స్వీటీ'కి రీమేక్‌ అంటూ ప్రచారంలోకి వచ్చింది?

'సోను కే టిటు కి స్వీటీ' అనేది గీతాఆర్ట్స్‌లో రీమేక్‌ చేద్దామని అడిగారు. చాలామంది అది నా కోసమని అనుకున్నారు. అయితే అది నా కోసం కాదు. దాన్ని రీమేక్‌ చేస్తే బాగుంటుందా! అని నేను పర్సనల్‌గా  ఆలోచించా. ఆ టైంలో త్రివిక్రమ్‌గారు, నేను కలిసి ఒక స్టోరీ అనుకున్నాం. రెండు స్టోరీల్లో మేమనుకున్నదే బెటర్‌ అనిపించింది. అందుకే 'సోను కే టిటు' జోలికి వెళ్లకుండా ఈ స్టోరీతోటే ముందుకెళ్లాం.

 

ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చెయ్యాలని ఎందుకనుకున్నారు?

ఇంతకుముందు 'జులాయి'లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువ ఉంటే, 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో ఎమోషన్‌ ఎక్కువతో ఎంటర్‌టైన్‌మెంట్‌ తక్కువ అయ్యింది. దాంతో మళ్లీ సినిమా చేసినప్పుడు ఎక్కువ ఎంటర్టైన్మెంట్‌ ఉన్న సినిమా చెయ్యాలని అప్పుడే ఇద్దరం అనుకున్నాం. అనుకోకుండా నా చివరి మూడు సినిమాలు 'సరైనోడు', 'డీజే', 'నా పేరు సూర్య' కొంచెం సీరియస్‌ సినిమాలు అయ్యాయి. నాక్కూడా 'రేసుగుర్రం' లాంటి ఫన్‌ ఎంటర్టైన్మెంట్‌ ఫిల్మ్‌ చెయ్యాలని ఉంది. త్రివిక్రమ్‌గారు 'అరవింద సమేత' లాంటి సీరియస్‌ సినిమా తర్వాత ఎంటర్టైన్మెంట్‌ ఫిల్మ్‌ చెయ్యాలనుకున్నారు. ఆయన దగ్గర 'అల వైకుంఠపురములో' స్టోరీ ఉంది. ఆ కథను ఆయన నాకెప్పుడో చెప్పారు. అది బాగుంటుందని అనుకున్నాక, దాన్ని డెవలప్‌ చేశారు. నేను ఇంతదాకా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎప్పుడూ చెయ్యలేదు. నాకీ జోనర్‌ కొత్త. అందులోనే హీరోయిజం, యాక్షన్‌ కూడా బాగా కుదిరాయి. అలాగే పాటలు కూడా.

 

త్రివిక్రమ్‌తో సౌకర్యంగా ఉంటుందనా మూడు సినిమాలు చేశారు?

నా చివరి 10 సినిమాల్లో 3 త్రివిక్రమ్‌గారితోనే చేశాను. ఆయనేమో నేను 10 సినిమాలు చేస్తే, వాటిలో 3 మీతోనే చేశాను అని ఆయనంటున్నారు. కొన్నిసార్లు ఒక హీరోకి, ఒక డైరెక్టర్‌కి  ఒక రిథం సెట్టవుతుంది. పాత రోజుల్లో చిరంజీవిగారికీ, కోదండరామిరెడ్డిగారికీ బాగా సెట్టయింది. వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. అలా కలిసి చాలా సినిమాలు చెయ్యగల కెమిస్ట్రీ త్రివిక్రమ్‌గారికీ, నాకూ మధ్య ఉంది. మేం ఒకళ్లనొకళ్లం బాగా అర్థం చేసుకుంటాం. ఆయనతో నాకంత సౌకర్యంగా ఉంటుంది కాబట్టే 3 సినిమాలు చెయ్యగలిగాను.

 

ఆయనతో మూడు సినిమాల వల్ల నటుడిగా మీకు ఉపయోగపడిందా?

కచ్చితంగా ఉపయోగపడిందని భావిస్తాను. ప్రతి డైరెక్టర్‌ ఒక నటుడి నుంచి కొత్తగా ఏదో ఒకటి వెలికి తీస్తారు. 'జులాయి'కి ముందు నేను 'బద్రినాథ్‌' చేశాను. అప్పటివరకు నేను చేసినవి ఒకెత్తు. 'జులాయి' నుంచి చూస్తే నా సినిమాలు మెచ్యూర్డ్గా, వేరే విధంగా ఉండటం కనిపిస్తుంది. యాక్టర్‌ నుంచి బెస్ట్‌ పర్ఫార్మెన్స్ను రాబట్టడంలో త్రివిక్రమ్‌ ఎక్స్పర్ట్‌. 'జులాయి'లో అది మీకు కనిపిస్తుంది. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో మరింత బాగా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలోనూ పర్ఫార్మెన్స్‌ పరంగా కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఇందులో నేచురల్‌, రియల్‌ టైం పర్ఫార్మెన్స్‌ ఇవ్వడానికి ప్రయత్నించా. ప్రతి సినిమా ఎదగడానికి మనకు లభించిన ఒక అవకాశం. కొంతమంది దర్శకులు మన బలాల్ని ఉపయోగపెడ్తారు. కొంతమంది దర్శకులు మనకు కొత్త బలాల్నిస్తారు. మనకు కొత్త బలాన్నిచ్చే కొద్దిమంది దర్శకుల్లో త్రివిక్రమ్‌ ఒకరు. మనల్ని మనం బెటర్గా అర్థం చేసుకోడానికి ఉపయోగపడే వ్యక్తి ఆయన.

 

ఇందులో మీ క్యారెక్టర్‌ ఏమిటి?

వైకుంఠపురం అనే ఇల్లుంది. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ల మధ్య జరిగిన సంఘటనలే ఈ సినిమా. ఈ సినిమాలో నేను ఒక మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా చేశాను. పూజాహెగ్డే బాస్‌గా  ఉన్న ఆఫీసులో పనిచేస్తుంటాను. నాకూ, మా నాన్నకూ పడదు. మా నాన్నగా మురళీశర్మ చేశారు. వైకుంఠపురం అనే ఒక పెద్ద  ఇంటికీ, మాకూ ఉన్న కనెక్షన్‌ ఏమిటనేది సినిమాలో చూడాలి.

సంక్రాంతి పోటీపై మీ అభిప్రాయమేమిటి?

సంక్రాంతి పోటీ అనేది యుగయుగాల నుంచీ ఉంది. దశాబ్దాల నుంచీ ఈ పండుగకు పెద్ద సినిమాలు వస్తూనే ఉంటున్నాయి. ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీసే ఏ ప్రొడ్యూసర్‌ అయినా సోలో రిలీజే కోరుకుంటాడు. అలా వస్తే చాలా డబ్బులొస్తాయ్‌. సంక్రాంతికి రెండు మూడు సినిమాలైనా ఎందుకొస్తాయంటే, మిగతా రోజుల్లో సోలో రిలీజ్‌ కు  వచ్చిన దానికంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి. అందుకే ఎవరూ ఈ సీజన్‌ను  మిస్‌ చేసుకోవాలని  అనుకోరు. అన్ని సినిమాలకూ ఈ పండుగకు చోటుంటుంది. అన్నీ ఆడాలని కోరుకుంటున్నా. మా సినిమాతో పాటు 'దర్బార్‌', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎంత మంచివాడవురా' కూడా ఆడాలని ఆశిస్తున్నా.

 

'సామజవరగమన' సాంగ్‌ వెనుక ఉన్న కథేమిటి?

హైదరాబాద్‌లో కుర్రాళ్లు తెలుగు పాటలు బాగా ఇష్టపడుతున్న విషయం తెలిసింది. తెలుగు రాక్‌ బ్యాండ్స్‌ కూడా తయారయ్యాయి. ఆ విషయం త్రివిక్రమ్‌గారితో పంచుకున్నా. ఆ జోనర్లో ఒక పాట పెడితే క్లిక్‌ అవుతుందని చెప్పా. ఆ టెంపోతో తమన్‌ ఒక ట్యూన్‌ చేస్తే, దానికి త్రివిక్రమ్‌ 'సామజవరగమన' అనే ఒక పదం రాశారు. ఆ తర్వాత సీతారామశాస్త్రిగారు ఆ పాట రాశారు. అది చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత 20 రోజులు గ్యాప్‌ వచ్చింది.  ఆ తర్వాత దాన్ని లైవ్‌ పర్ఫార్మెన్స్‌ లాగా చిత్రీకరించి రిలీజ్‌ చేశాం. ఆ ఐడియా త్రివిక్రమ్‌గారిది . ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు.

 

సినిమాకు మూడు నెలల ముందే ఆ సాంగ్‌ రిలీజ్‌ చెయ్యాలనేది ఎవరి ఆలోచన?

అది నా ఆలోచన. అంత ముందుగా సాంగ్‌ రిలీజ్‌ చేద్దామని నేననగానే అందరూ భయపడ్డారు. హిందీ సినిమాల్లో అందరూ దాదాపు 4 నెలల ముందే సాంగ్స్‌ రిలీజ్‌ చేస్తుంటారు. మనకి కూడా ఆ కల్చర్‌ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక పాట వ్యాప్తి చెందాలంటే టైం తీసుకుంటుంది. సినిమా అయితే ఒకటే స్టేట్‌ కాబట్టి పది, పదిహేను రోజుల్లో వ్యాప్తి చెందుతుంది. కానీ సాంగ్‌ అలా కాదు. అది జనాల్లోకి బాగా వెళ్లడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. అందుకే అంత ముందుగా ఆ సాంగ్స్‌ విడుదల చేశాం. అందుకే అవి అంత బాగా హిట్టయ్యాయి. 'సామజవరగమన'కు సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌  అనే పేరు కూడా వచ్చింది.

 

మలయాళంలోనూ క్రేజ్‌ తెచ్చుకోవడాన్ని ఎలా ఫీలవుతున్నారు?

అద్భుతంగా ఫీలవుతున్నా. అక్కడ నాకు మామూలు గౌరవం లభించలేదు. ఇప్పటివరకూ ఏ తెలుగు హీరోకూ దక్కని గౌరవం నాకు దక్కింది. నన్ను దుబాయ్‌ తీసుకెళ్లి ఒక గొప్ప పురస్కారాన్ని ఇచ్చారు. దాన్ని అందుకున్న తొలి మలయాలేతర వ్యక్తిని నేను. అలాగే కేరళలో బోట్‌ రేస్‌ ఫెస్టివల్‌ ఒకటి జరుగుతుంది. దానికి అక్కడి గవర్నర్తో పాటు నన్ను చీఫ్‌ గెస్ట్గా పిలిచారు. ఆ గౌరవం అందుకున్న తొలి తెలుగు నటుడ్ని నేనే. అది నాకొక్కడికి లభించిన గౌరవం కాదనీ, మన తెలుగువాళ్లందరికీ లభించిన గౌరవమనీ నాకు అనిపించింది.

 

మీ పిల్లల్ని సెట్‌కు  తీసుకెళ్తుంటారా?

అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాను. దానికో రీజన్‌ ఉంది. ఇదివరకు జనరేషన్‌ వాళ్లు పిల్లల్ని చిత్రీకరణటైంలో తీసుకెళ్తే పాడైపోతారనే ఫీలింగ్తో ఉండేవాళ్లు. పిల్లలకు సినిమాలు కూడా చూపించేవాళ్లు కాదు. రియాలిటీకి దూరంగా పెట్టేవాళ్లు. అది నాకు డబుల్‌ స్టాండర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అది నేను చేసే పని. నన్ను ఈ స్థాయికి తెచ్చింది సినిమాయే. నాన్న ఏం చేస్తుంటాడనే విషయం నా పిల్లలకు తెలియాలి, నా లైఫ్‌ ఎలా ఉంటుందో తెలియాలి. అందుకే వాళ్లను తీసుకెళుతుంటాను.

మరింత సమాచారం తెలుసుకోండి: