నిన్న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ మహేష్ అభిమానుల అంచనాలను అందుకున్నా సగటు ప్రేక్షకుడి అంచనాలను పూర్తిగా అందుకోలేక పోవడంతో ఈ మూవీ మహేష్ ఊహించుకున్నట్లుగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఆస్కారం కనిపించడం లేదు. అయితే ఈ మూవీ భవిష్యత్ ఈరోజు విడుదల అవుతున్న ‘అల వైకుంఠపురములో’ మూవీ పై సగటు ప్రేక్షకుడు ఇచ్చే తీర్పు బట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ ఏ రేంజ్ హిట్ గా మారుతుంది అన్న విషయం నిర్ణయింపబడుతుంది. 

ఇలాంటి పరిస్థితులలో ఈరోజు విడుదల అవుతున్న తన మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మహేష్ కు వత్తాసు పలుకుతూ కామెంట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రమోషన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ తనకు ప్రయోగాలు చేయాలి అన్న కోరిక ఉన్నా సగటు ప్రేక్షకుడుకి ఎలాంటి ప్రయోగం నచ్చుతుందో తెలియక దానికితోడు తన ప్రయోగాలతో  తన నిర్మాతలకు బయ్యర్లకు నష్టం కలిగించడం ఇష్టం లేక ఇక తాను భవిష్యత్ లో పూర్తిగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తాను అని ఓపెన్ గా చెప్పాడు. 

ఈ కామెంట్స్ బన్నీ దృష్టి వరకు రావడంతో మహేష్ మాటలకు పూర్తిగా సపోర్ట్ ఇస్తూ తన ఆలోచన కూడ ఇదే విధానంలో ఉంటుంది అని కామెంట్ చేసాడు. అంతేకాదు ప్రయోగాలు చేస్తూ నటించే సినిమాలకు వందల కోట్లల్లో కలక్షన్స్ రావని అందువల్ల తాను మహేష్ భావనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అంటూ అభిప్రాయపడ్డాడు. 

నిన్నటి వరకు సంక్రాంతి కోడి పందాలలోని కోడి పుంజులు లా సంక్రాంతి సినిమా రేసులో ఒకరికొకరు చెక్ పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ బన్నీ మహేష్ లు ఇండస్ట్రీలో వేడి పుట్టించారు. అయితే ఇప్పుడు సంక్రాంతి రేస్ ప్రారంభం అయిపోయి ఎవరి రేంజ్ ఏమిటో తేలిపోతున్న సమయంలో ఇప్పుడు బన్నీ మహేష్ కు సపోర్ట్ గా నిలవడం చూస్తుంటే రాజకీయాలలో సినిమాలలో శాశ్విత శతృవులు శాశ్విత మిత్రులు ఉండరు అన్న విషయం మరొకసారి రుజువైంది..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: