సంఘటన ఎలాంటిదైనా రాజకీయ పార్టీల వాళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీపై పడడం బాగా అలవాటైంది. ఉద్యమాల పేరుతో కళపై దౌర్జన్యం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఇది ప్రజలకు స్పష్టంగా తెలిసింది. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని రౌడీల దౌర్జన్యం చేసింది కళ్ళార చూశాం. అప్పట్లో టాలీవుడ్ కి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఓపెనింగులు లేక రిలీజ్ లు లేక శాటిలైట్ కొనేవాళ్లు లేక పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో తెలిసిందే. 

 

ఇప్పుడు కూడా అలాంటి అరాచకం చేయాలనుకుని ఏకంగా నేల కరుచుకున్నారు. రాజధాని పేరుతో కళపైనా.. సినిమాపైనా దాష్ఠీకానికి తెగబడాలన్న కుట్ర కోణం బయటపడింది. అమరావతిలో రైతులు రాజధాని కోసం ఆందోళన చేస్తున్న సమయంలో ముష్కర దాడుల ప్రణాళిక గురించే తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాలంటూ కొంత మంది విద్యార్థులు హైదరాబాద్ లో ని సెలబ్రిటీల ఇళ్లను టార్గెట్ చేసారంటే దానివెనక ముష్కర కుట్ర ఉందన్న వాదన బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ముందుగా మహేష్ ఇంటిపై పడ్డారు. సూపర్ స్టార్ అమరావతి రాజధాని ఉద్యమానికి సహకరించాలని...రైతుల పక్షాన మాట్లాడాలని డిమాండ్ చేసారు. ఆ తర్వాత వరుసగా హీరోల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

 

హీరోల నుంచి మద్దతు లభించని పక్షంలో ఆ హీరోల సినిమాలు చూడకూడదని...అందుకు విద్యార్థులు... రైతు కుటుంబాలు కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నారు. అయితే ఈనెల 11న మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకు తొలి షోతోనే మంచి టాక్ వచ్చింది. బొమ్మ దద్దరిల్లిందన్న ప్రచారం పోస్టర్లు సైతం షురూ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ హౌస్ ఫుల్  అవుతున్నాయి. తాజాగా ఈ ఆదివారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' కూడా రిలీజ్ అయింది. 

 

అయితే రాజధాని ఎఫెక్ట్ ఈ రెండు సినిమాలపై ఎక్కడా కనిపంచలేదని స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో అన్ని థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. గుంటూరు-విజయవాడ నడిబొడ్డున ఉన్న థియేటర్లు కూడా హౌస్ ఫుల్ అవుతున్నట్లు సమాచారం. రాజధాని విద్యార్థి సంఘాలు అల్టిమేటం జారీ చేసినా రాజధాని సెగ అనుకున్నంతగా పని చేయలేదని వసూళ్ల ప్రూఫ్ లు కనిపిస్తున్నాయి. కేవలం ఓ సామాజిక వర్గం మాత్రమే రాజధానిపై రచ్చ చేస్తోందన్న విషయం ప్రజలకు తెలిసిందని వైకాపా నేతలు చెబుతున్నారు. అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా  ఉద్యమం కేవలం అమరావతి పది- పదిహేను గ్రామాలకే పరిమితమైంది. మిగతా అన్ని జిల్లాల ప్రజల నుంచి మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని హర్షం వ్యక్తం అవుతోంది. టాలీవుడ్ ని  వైజాగ్ లో అభివృద్ది చేస్తే  బాగుంటుందని సెలబ్రిటీలు సైతం స్పందించారు. అంతేకాదు మరో టాలీవుడ్ ని బీచ్ సొగసుల విశాఖ నగరంలో అత్యంత భారీగా నిర్మించాలన్న సంకల్పంతో వైకాపా అధినాయకుడు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి సన్నాహాల్లో ఉన్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: