అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం నిన్న రిలీజైంది. మొదటి నుండి ఈ సినిమాకి పాజిటివ్ ఏర్పడింది. ఆ పాజిటివ్ బజ్ తో పాటు.. సినిమా ప్రోమోలు మరింత అంచనాలని పెంచాయి. అలాగే పాటలు ఇంకా హైప్ చేశాయి. వీటన్నింటి మధ్య రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సునామీని సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్ళను రాబట్టే దిశగా పరుగులు పెడ్తోంది.
ఓవర్సీస్ లో దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు ఓవర్సీస్ లో మంచి వసూళ్ళను రాబడతాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం కూడా అమెరికాలో మంచి వసూళ్ళని సాధించింది. వసూళ్లలో తెలుగు సినిమా రికార్డులని చెరిపేసేలా ఉంది. ఇప్పటికే అమెరికాలో ప్రిమియర్లకు అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా అల వైకుంఠపురములో నాన్-బాహుబలి రికార్డు నెలకొల్పింది.
శనివారం నాటి స్పెషల్ షోలతోనే ఈ చిత్రానికి 60 వేల దాకా టికెట్లు తెగినట్లు సమాచారం. ఆ స్థాయిలో ప్రిమియర్లతో మరే నాన్-బాహుబలి మూవీకి కూడా టికెట్లు అమ్ముడవలేదట. ఈ లెక్కన ఈ సినిమాకి అమెరికాలో ఎంతటి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ప్రీమియర్లతోనే అంతలా వసూళ్ళు సాధించిన ఈ చిత్రం మరిన్ని రోజుల్లో ఇంకా కలెక్షన్లను పెంచుకుంటూ పోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ప్రీమియర్ల ద్వారా నాన్ బాహుబలి రికారు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో చిత్రానికి మంచి రివ్యూలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళందరూ బాగుందని అంటున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. థమన్ సంగీతం అందించారు.