నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి, తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. ఆ తరువాత ఆయన తీసిన సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలు కూడా వరుసగా విజయాలు అందుకుని టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా అనిల్ కు తిరుగులేని పేరు తీసుకువచ్చాయి. మంచి కథా బలం ఉన్న సినిమాలను ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించడంలో మంచి దిట్టగా పేరుగాంచిన అనిల్ రావిపూడి, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన సినిమా సరిలేరు నీకివ్వరు, ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. 

 

నిజానికి కొన్నాళ్ల నుండి ఎక్కువగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న మహేష్, ఈ సినిమాతో మరొక్కసారి తనలోని కామెడీ కోణాన్ని బయటకు తీసు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ని కనబరిచారు. వాస్తవానికి ఈ సినిమాలో యాక్షన్, కామెడీ వంటివి బాగున్నప్పటికీ బలమైన కథ, కథనాలు లేకపోవడంతో కొందరు ప్రేక్షకులు ఈ సినిమాపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్  ఆకట్టుకున్నప్పటికీ, అందులో కొంత బలవంతపు కామెడీ సీన్స్ ని పెట్టడం జరిగిందని, వాటివలన ప్రేక్షకుడికి నవ్వు రాకపోగా టైం చాలా వేస్ట్ అయిందని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ ని ఎంతో మాసీగా, హిలేరియస్ గా డిజైన్ చేసిన అనిల్, సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా చోట్ల తడబడ్డాడని అంటున్నారు. సినిమాలో మహేష్ పాత్రతో ఎక్కువగా కామెడీ చేయించడం బాగున్నప్పటికీ కథకు ముఖ్యంగా బలంగా నిలిచిన పేట్రియాటిక్ ఫిల్ ని మాత్రం ఆకట్టుకునే రీతిలో తీయలేకపోయాడని అంటున్నారు. 

 

ఇక సినిమాలో సెకండ్ హాఫ్ భారీ లెంగ్త్ తో సాగదీయడం కూడా సినిమాకు దెబ్బేసిన మరొక అంశం అని అంటున్నారు. నిజానికి అనిల్ గారిపై మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అని, అయితే ఆయన ఓవర్ ఆల్ గా మా హీరోగారికి కేవలం యావరేజ్ సినిమాని మాత్రమే ఆనించగలిగాడని కొందరు మహేష్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతోపాటు మహేష్ బాబు స్టామినా వలన సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తోందని, అయితే రాబోయే సోమవారం తరువాత సినిమా సీన్ చాలా వరకు అయిపోయే పరిస్థితులు కనపడుతున్నట్లు కొందరు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: