పండగ రోజుల్లో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లడం సంక్రాంతి ఫెస్టివల్లో భాగమైపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే దర్శక నిర్మాతలు సరిగ్గా సంక్రాంతి టైమ్ చూసి... సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద సినిమాలే బరిలోకి దిగాయి. కాని, వీటిలో వార్ మాత్రం రెండు సినిమా మధ్యే జరుగుతుంది. అందులో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రం ఒకవైపు.. తన మాటల గారడితో మొదటి సినిమా నుండి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు ఒకవైపు. అదేనండీ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` ఒకటైతే.. మరోవైపు సూపర్ స్టార్ మహేస్ బాబు `సరిలేరు నీకెవ్వరు` సినిమా మధ్య యుద్ధం నడుస్తోంది.
ఈ స్టార్ హీరోల చిత్రాల కోసం అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.మొత్తానికి జనవరి 11న ‘సరిలేరు’, 12న ‘అల’ విడుదలయ్యాయి. ఒక రోజు వ్యవదిలో విడుదలైన ఈ రెండు చిత్రంలకు హిట్ టాక్ లభించింది. ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థలు తొలిరోజు నుంచే విపరీతమైన ప్రచారం మొదలుపెట్టాయి. అయితే తెలుగు సినిమా చరిత్రలో బాక్సాఫీసు కలెక్షన్ల మీద ఇంత గందరగోళ పరిస్థితి ఎప్పుడూ రాలేదేమో. విడుదలైన ఈ రెండు బడా సినిమాలు పోటాపోటీగా బాక్సాఫీసు కలెక్షన్లను ప్రకటిస్తుండటం ఇదే మొదటిసారేమో కూడా.
మరోవైపు అల, సరిలేరు ఎవరికి వారు తమ సినిమాయే హిట్ అని.. ఎక్కువ వసూళ్లు అని లెక్కలు వేసుకుంటున్నారు. బన్నీ సినిమా ముందుగా తమ సినిమా సంక్రాంతి విన్నర్ అని పోస్టర్ వేసుకుంటే.. ఆ తర్వాత మహేష్ సరిలేరుకు సంక్రాంతి రియల్ విన్నర్ అని పోస్టర్ వేసుకున్నారు. అంతేనా.. మా సినిమా ‘నాన్-బాహుబలి 2’ రికార్డులను బద్దలుకొట్టేసిందని సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్ర నిర్మాణ సంస్థలు ఎవరికివారు చెప్పుకుంటున్నారు. రెండు సినిమాలకూ ఒకేసారి నాన్-బాహుబలి రికార్డులు ఎలా వస్తాయో అర్థం కావడంలేదు. దీంతో జనాలు తీవ్ర కన్ఫ్యూజన్లో పడ్డారు. అసలు ఎవరి సినిమా ఇరగదీసింతో తెలియక అయోమయం వ్యక్తం చేస్తున్నారు.