రజినీకాంత్ సినిమా ఎలా ఉన్నా కూడా అది రజినీ సినిమా అంతే.. అభిమానులు తొలిరోజు పండగ చేసుకుంటారు. ఆయన్ని స్క్రీన్పై చూడ్డానికి ఆసక్తి చూపిస్తుంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం దర్బార్. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్తో, హైటెక్నికల్ వాల్యూస్తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న భారీ ఎత్తున విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఊహించినట్లుగానే ఈ చిత్రం ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి.
రజినీ మేనియా అన్నిచోట్లా కనిపించింది. ముఖ్యంగా ఓవర్సీస్లో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో కన్నా తమిళ్లో మంచి వసూళ్లను రాబడుతోంది. కారణం అక్కడ ఏ సినిమా రజనీకి పోటీగా రాకపోవడం. కానీ.. రజినీ దర్బార్కు పోటీగా ధనుష్ దిగాడు. ధనుష్ కొత్త సినిమా 'పట్టాస్' ఈ నెల 15వ తేదీన విడుదలై అదిరిపోయే టాక్తో వసూళ్లపరంగా తమిళనాట దుమ్మురేపేస్తోంది. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథాకథనాలు, ధనుశ్ ద్విపాత్రాభినయం ఆకట్టుకోవడం వల్లనే అక్కడ ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దీంతో మామ రజనీకాంత్ సినిమా కంటే ధనుష్ సినిమా బెటర్ టాక్ తెచ్చుకోవడంతో దర్బార్ వసూళ్లకు గండిపడిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రభావం వీకెండ్ లో మరింతగా కనిపించే అవకాశం ఉందని, దర్బార్ వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడితే ఆ మజానే వేరు. ఇక సంక్రాంతి అనేది తమిళనాడు ప్రజలకు కూడా చాలా ముఖ్యమైంది, కాబట్టి ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నారు. ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా పోటీ పడుతున్నాయి.