దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ కి సంబంధించిన తాజా అప్ డేట్స్ ప్రేక్షకుల్లో ఎప్పటికప్పుడు హాట్ న్యూస్ గా మారుతున్న సంగతి తెలిసిందే. చరణ్.. తారక్ వంటి హీరోలు అప్పుడప్పుడు కొన్ని క్లూస్ ఇస్తూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే డబ్బైశాతం పూర్తయింది. రామ్ చరణ్- ఎన్టీఆర్ తో సహా ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్- అరకు- వికారాబాద్ ఫారెస్ట్ లో పోరాట సన్నివేశాలను తెరక్కించారు. అడవి నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇక చరణ్ కి జోడీగా .. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్-అలియా రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని ఒక ప్రచారం సాగింది.

 

సీతతో రామరాజు లవ్ సీన్స్.. భార్యాభర్తల అనుబంధానికి సంబంధించిన సీన్స్ ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేక సెట్లలో తెరకెక్కించారని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారమైంది. ఆ తర్వాత ఆలియా బాలీవుడ్ లో కొత్త సినిమాకు కాల్షీట్లు కేటాయించినట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. చరణ్- అలియా మధ్య ఇప్పటివరకూ ఒక్క సీన్ కూడా తెరకెక్కించనేలేదు. జనవరి 20 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో అలియా పాల్గొంటుందని సమాచారం. చరణ్-ఎన్టీఆర్- సముద్రఖని తో పాటు అలియా భట్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. కొన్ని పోరాట ఘట్టాలతో పాటు లీడ్ రోల్స్ పై ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేయనున్నారట.

 

అయితే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కు జంటగా ఎంపికైన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ జెన్నీఫర్ పాల్గొనే అవకాశం కనిపంచడం లేదని తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత తారక్-ఒలీవియా మధ్య సన్నివేశాలు  చిత్రీకరించనున్నట్లు  తెలుస్తోంది. దాదాపు ఈనెల 20 నుంచి మార్చి నెలాఖరు వరకూ తారక్-చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ తోనే బిజీగా ఉండనున్నారుట. వాళ్లపై షూటింగ్ పూర్తిగా వచ్చే నెలాఖరకు పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏదేమైనా ముందుగా ప్రకటించిన తేదికే ఆర్.ఆర్.ఆర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: