ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కొందరు ఓవర్ నైట్లో స్టార్ స్టేటస్ దక్కించేసుకుంటారు. కొందరికి ఎన్ని ఏళ్ల నుండి సినిమా చేసినా సరైన గుర్తింపు ఉండదు. ఒక్కోసారి ముందు ఐరెన్ లెగ్ ట్యాగ్ లైన్ వేసుకొని.. ఆ తర్వాత వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ కూడా వున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ పూజా హెగ్డే పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ హీరోలకు ఇప్పుడు ఆమె పెద్ద సెంటిమెంట్ గా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవ ఉండదు. ఆలా ఆ సెంటిమెంట్స్ లిస్టులో మరో సెంటిమెంట్ వొచ్చిచేరింది. మెగా హీరోలు ఏ సినిమా చేసినా సరే అందులో పూజా ఉందంటే చాలు ఆ బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్నారు.
ఒకప్పుడు హిట్ బొమ్మ లేక నానా అష్ట కష్టాలు పడ్డ పూజ గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో తన ఖాతాలో వేసుకుంటోంది. మెగా హీరోలతో పూజ చేసిన సినిమాలు చూస్తే ‘ముకుంద’.. ‘డీజే’.. ‘గద్దలకొండ గణేశ్’.. ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో వరుస హిట్లను అందుకుంది. వరుణ్ తేజ్ తో రెండుసార్లు.. తాజాగా ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్తో రెండు సార్లు జత కట్టింది.
ఇక రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాలోనూ ఆమె స్పెషల్ సాంగ్లో ఆడి పాడింది. దీంతో పూజ మెగా హీరోల సినిమాల్లో ఉంటే చాలు వాళ్లకు బొమ్మ హిట్ అవుతుండడంతో ఇప్పుడు వారంతా తమ సినిమాల్లో పూజనే హీరోయిన్ గా పెట్టుకోవాలని ఆమెనే కోరుకుంటున్నారట. వరుణ్ తేజ్, సాయి తేజ్, చెర్రీ ఇప్పుడు పూజ కోసం బాగా ట్రై చేస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా పూజ మాత్రం వరుస హిట్లతో ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది.