`మా` లో ఎప్పటికప్పుడు ఏవో ఒకటి కొత్త కొత్త వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొత్త వచ్చిన నరేష్, జీవిత, రాజశేఖర్లు వీళ్ళు మా కి చేసే పనులు ఎలా ఉన్నా వీళ్ళ మనస్పర్ధలు, గొడవలే ఎక్కువయిపోయాయి. ఎప్పుడు చూడు ఏదో ఇక వివాదంతో తెరపైకి వస్తూనే ఉంటున్నారు. అందులో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి. ఎవరికి ఏ విధమైన సర్వీసును అందించాలి ఇలాంటి వాటి పైన దృష్టిని సారించకుండా ఎంత సేపు వీళ్ళ గొడవలతో చిలవల పలవలు చేసుకుంటున్నారు.
ఇటీవలె జరిగిన మా డైరీ ఆవిష్కరణ సమయంలో హీరో రాజశేఖర్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సభలో ఎంతో మంది పెద్దలున్నా కూడా ఏమీ ఆలోచించకుండా ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోయారు. అప్పుడు చిరంజీవి, మోహన్బాబు తదితర పెద్దలు ఆయన మాటల పై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జీవిత వంతు వచ్చింది. ‘మా’లో జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న జీవిత..ఇప్పుడు ఆమెకూ, ‘మా’కు మధ్య గొడవ మొదలైంది. ఈ మధ్య మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా కొంతమంది పేద కళాకారులకు టూ వీలర్స్ ను ప్రదానం చేశారు. అవి కూడా బయటి నుంచి వాటి కోసం స్పాన్సర్లను తీసుకొచ్చి మరీ ఇప్పించారు. వాటికి సంబంధించిన చెక్లను మా ఇంకా ఇష్యూ చేయలేదు. జనరల్ సెక్రటరీ హోదాలో చెక్ బుక్పై సంతకాలు చేసే అధికారం కేవలం జీవితకు మాత్రమే ఉంది.
ఇక జీవిత మాత్రం సంతకాల విషయానికి వచ్చే సరికి ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేస్తోంది. దీనికి నరేష్ చూసి చూసి విసుగు చెంది అధ్యక్షుడి హోదాలో చెక్లపై సంతకాలు చేసి, నిధుల్ని విడుదల చేశారు. దీంతో జీవితకు ఇలా చేయడం నచ్చలేదని తెలుస్తోంది. ఈ విషయం పై అగ్గిగుగ్గిలమైన జీవిత ‘నేను సంతకం చేయకుండా డబ్బులు బయటకు ఎలా తీస్తారు’ అంటూ మా కార్యాలయానికి వచ్చి, చెక్ బుక్స్ని పట్టుకెళ్లిపోవడమే కాకుండా, గదులకు తాళాలు కూడా వేసుకుని వెళ్లిపోయారట. రెండ్రోజుల నుంచి `మా`కి సంబంధించిన పనులేవీ జరగడం లేదు. ఆఖరికి మా కార్యాలయంలో ఉండే రెగ్యూలర్ స్టాఫ్ కూడా సైతం విధులకు హాజరు కావడం లేదు. దాంతో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయని తెలుస్తోంది. రాజశేఖర్ గొడవ సద్దుమణాగక ముందే జీవిత ఈ రకంగా ప్రవర్తించడం మాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి ఈ గొడవ ఎప్పుడు తేలుతుందో..? మరికొంత మంది అయితే వీరిద్దరూ కావాలనే ఇలా చేస్తున్నారా ఏంటి అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.