టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్లు వచ్చారు..వస్తున్నారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్ది మంది కమెడియన్ల పేర్లు చిరస్థాయిగా చెప్పుకుంటారు. అలాంటి వారిలో రేలంగి, రాజబాబు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లకు ఎంత డిమాండ్ ఉండేదో.. కమెడియన్లుగా వారికీ అంతే డిమాండ్ ఉండేది. రెండు దశాబ్దాలు హాస్యనటునిగా ఒక్క వెలుగు వెలిగిపోయారు రాజబాబు. ఆయన కనిపిస్తేనే థియేటర్లో కూర్చున్నవారంతా నవ్వులతో అల్లరి చేసేవారు. ఆయన మానరీజం, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ ఎలాంటి వారినైనా నవ్వించేస్తాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. ఉపాధ్యాయ వృత్తి నుండి స్టార్ కమెడియన్ గా ఎదిగారు. అయితే ఆయన కెరీర్ అంత ఈజీగా సాగలేదని అంటారు. సినిమాల మీద మోజుతో. 1960 రోజున మద్రాసు చేరుకొన్నాడు.
అక్కడ చిన్న ఛాన్స్ కోసం పడిగాపులు కాచిన రోజులు ఉన్నాయట.. ఈ విషయం ఆయనతో ఎక్కువగా నటించిన రమాప్రభ ఓ ఇంట్వ్యూలో చెప్పారు. అప్పట్లో సినిమా ఛాన్సు కోసం ఎదురు చూస్తున్న రాజబాబు ఐదు రోజుల పాటు మంచినీళ్లు మాత్రమే తాగి బతికారట. మొదట అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించాడు. మొదటి సినిమా తరువాత "తండ్రులు-కొడుకులు", "కులగోత్రాలు","స్వర్ణగౌరి","మంచి మనిషి" మొదలగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి మూవీకి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించాడు. కమెడిన్ గా సత్తా చాటుతున్న రోజుల్లో ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35వేల రూపాయలు. రాజబాబు పారితోషికం 20వేల రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకూ 35వేల రూపాయలు కావాల్సిందేనని పట్టుపట్టారు రాజబాబు.
‘ఎన్టీఆర్ హీరో.. మీరు కమెడియన్’ అని నిర్మాత అంటే, ‘అయితే హీరోనే కమెడియన్గా చూపించి సినిమాను విడుదల చేయండి’ అని సమాధానం ఇచ్చారట. జగపతి ఫిలింస్ వి.బి.రాజేంద్రప్రసాద్ మూవీ"అంతస్తులు" లో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా పెద్దమొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందాడు. తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో ప్రముఖ మూవీలో నటించాడు. ఒకప్పుడు మద్రాస్లో కేవలం మంచినీళ్లు తాగి రోజులు వెళ్లదీసిన రాజబాబు.. కమెడియన్గా హీరోను మించిన పాపులారిటీ, డబ్బు సంపాదించారు. ఆ రోజుల్లోనే రాజబాబు లక్షల్లో పారితోషికం తీసుకున్నారు.