సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా సక్సెస్‌ మాత్రమే ముఖ్యం. అది లేకుంటే ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అందుకే ఏ దర్శకుడికైనా ఒక్క హిట్ వస్తే వెంటనే హీరోలు నిర్మాతలు క్యూ కట్టేస్తారు. కానీ అన్ని సందర్భాల్లో ఇలా జరగదని కొందరి దర్శకులను చూస్తే తెలుస్తుంది. ఆర్.ఎక్స్ 100 సినిమాతో బ్లాక్‌ బస్టర్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి రెండో సినిమా కోసం మాత్రం నానా అవస్థలు పడుతున్నాడు. రామ్‌ గోపాల్‌ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అజయ్‌ మొదటి సినిమాతోనే తన మార్క్‌ చూపించాడు. ఆర్‌ఎక్స్‌ 100 సూపర్‌ హిట్ కావటంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారాడు.

 

అదే ఉత్సాహంతో రెండో సినిమాకు రెడీ అయ్యాడు. ఇద్దరు యంగ్ హీరోలతో ఓ మల్టీ స్టారర్‌ సినిమాను ప్లాన్ చేశాడు. కానీ కథ వర్క్‌ అవుట్ కాలేదో లేక హీరోల డేట్స్‌ అడ్జస్ట్ కాలేదో తెలియదుగానీ ఇంత వరకు అజయ్‌ రెండో సినిమా పట్టాలెక్కలేదు. మహా సముద్రం అనే టైటిల్‌ను చాలా కాలం కిందటే ఎనౌన్స్‌ చేసినా ఆ సినిమాకోసం హీరోలు దొరకడం లేదు. వాస్తవంగా ఈ కథను అందరికంటే ముందు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ కి చెప్పాడట. ఆ తరువాత రవితేజ పేరు కొన్నాళ్ళు వినిపించింది. అంతా రెడీ సెట్స్ మీదకి వెళ్ళడమే అనుకున్న సమయంలో అది ఆగిపోయింది. ఆ తరువాత ఫైనల్‌గా నాగచైతన్య ఈ సినిమాకు ఓకె చెప్పాడన్న వార్త వినిపించింది. చైతూ-అజయ్ భూపతి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కబోతుందన్న న్యూస్ బాగా వైరల్ అయింది.

 

అయితే తాజాగా నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. దీంతో మరో యంగ్ హీరో శర్వానంద్‌కు కథ వినిపించిన అజయ్‌ భూపతి, త్వరలోనే సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. శర్వానంద్‌ ప్రస్తుతం తమిళ సూపర్‌ హిట్ 96కు రీమేక్‌గా తెరకెక్కుతున్న జాను సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్‌ తరువాత మహా సముద్రం సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈసారైనా అజయ్ ప్రాజెక్ట్ ని మొదలు పెడతాడా లేక మళ్ళీ బ్రేక్ పడుతుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: