బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌-ద‌ర్శ‌కుడు  కరణ్ జోహార్, నటి కంగనా రనౌత్.. ఇటీవ‌ల వీరి మ‌ధ్య త‌ర‌చూ వివాదాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. .గత ఏడాది ఫిబ్రవరిలో కరణ్‌ జోహార్‌, కంగనా మధ్య మాటల యుద్ధం మొదలైంది. కరణ్‌ హోస్ట్‌గా 'కరణ్‌ విత్‌ కాఫీ' కార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరిలో కంగనా గెస్ట్‌గా ఆ కార్యక్రమానికి వచ్చింది. ఆ షో వేదిక బాలీవుడ్‌ చిత్రసీమలో పెరిగిపోతున్న బంధుప్రీతి గురించి గళమెత్తింది. సైఫ్‌ అలీఖాన్‌, వరుణ్‌ ధావన్‌ వంటి పేర్లను కూడా చెప్పింది. ఈ విషయంపై పెద్ద చర్చే నడిచింది. అయితే ఈ షోలో కరణ్ జోహార్‌ను ఉద్దేశించి కూడా కంగనా వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. 

 

తండ్రి వారసత్వంగా కరణ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంపై కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కరణ్ జోహార్‌పై కంగనా తన నోటి దురుసును ప్రదర్శించింది. దీంతో క‌ర‌ణ్ కూడా.. కంగ‌నాను టార్గెట్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. ఈ క్ర‌మంలోనే కంగనా ఎంచుకుంటున్న పాత్రలపై కరణ్ బహిరంగ విమర్శలు చేశాడు. మహిళా కార్డు వాడుకుంటోందని, బాధితురాలి పాత్రలనే కంగనా ఎంచుకుంటోందని కరణ్ వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఇదిలా ఉంటే.. కరణ్‌ జోహార్‌, కంగనా రనౌత్‌ మధ్య వార్‌ ముగిసినట్టేనా? పాత వివాదాలకు చెక్‌ పెట్టి మళ్లీ కలసి పని చేయాలనుకుంటున్నారా? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

 

దీనికి కార‌ణం కూడా ఉందండోయ్. ఇటీవ‌ల కేంద్రం ప్రకటించిన పద్మ శ్రీ అవార్డుల జాబితాలో వీరిద్దరితో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఏక్తా కపూర్, అద్నాన్ సమీ చోటు దక్కించుకోవడం తెలిసిందే. అయితే ఇక్క‌డ పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న కరణ్ జోహార్‌కు కంగనా రనౌత్ కంగ్రాట్స్ చెప్పింది. అంతేకాదండోయ్‌..  కరణ్ నిర్మాణంలో వైవిధ్యభరితమైన చిత్రాలు వచ్చాయని కంగనా ప్ర‌శంసించింది. తన తండ్రి ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించినా...తన సొంత ట్యాలెంట్‌తో కరణ్ పైకి ఎదిగారంటూ కితాబిచ్చింది కంగనా.  పద్మశ్రీ అవార్డుకు కరణ్ అన్ని విధాలుగా అర్హులంటూ ప్రశంసలు కురిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: