టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రెసన్స్ ను సినిమాలో వాడుకున్నా, ఏ సినిమా ఫంక్షన్ కు ఆయన వచ్చినా ఆ సినిమాలకు వచ్చే క్రేజ్ వేరు. ఈ విషయంలో హీరో నితిన్ ఎంతలా లాభపడ్డాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం యువ హీరో నాగశౌర్య కూడా పవన్ నామ జపమే చేస్తున్నాడు. మరో మూడు రోజుల్లో విడుదల కానున్న అతని సినిమా అశ్వథ్థామ సినిమాలో పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నాడు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ ఈ సినిమాకు ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి.

 

 

ఓ టిపికల్ సబ్జెక్ట్ తో వస్తున్న అశ్వథ్తామ సినిమాకు కథను హీరో నాగశౌర్యే అందించాడు. కథానుసారం ఆయనకు వాయిస్ ఓవర్ అవసరం వచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలోని ఓ డైలాగ్ ను, ఆ సన్నివేశాన్ని తన సినిమాకు వాయిస్ ఓవర్ గా తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని నాగశౌర్య స్వయంగా వెల్లడించాడు. కథానుసారం కావాల్సిన డైలాగ్ ఆ సినిమాలో ఉంది. అందుకే ఆ సన్నివేశాన్ని తీసుకుంటున్నాం. ఇందుకు గానూ పవన్ కల్యాణ్ ను, నిర్మాత శరద్ మరార్ ను కలిసి పర్మిషన్ కూడా తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. దీంతో తమ సినిమాకు అదనపు బలం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఈ యువ హీరో.

 

 

సొంత నిర్మాణ సంస్థ ఐరా ప్రొడక్షన్స్ పై ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు రమణ తేజకు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పాడు. దర్శకుడు కావాలనేది తన కల అని.. ఆ వ్యూలోనే ఈ కథను తయారు చేశానన్నాడు. కాకపోతే తాను దర్శకత్వం వహించాలనుకోలేదని భవిష్యత్తులో మాత్రం ఓ చిత్రానికి ఖచ్చితంగా దర్శకత్వం వహిస్తానని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: