మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ సినిమా ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న విషయం తెలిసిందే. మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఆ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా ఆ సినిమా పరాజయం తరువాత టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో మరొక హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ తొలిసారిగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. 

 

ఇప్పటికే చాలావరకు షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమాని జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు పలువురు బాలీవుడ్, హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోలిద్దరి పోర్షన్ మే సమయం కల్లా పూర్తి అవుతుందని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండా మరొక సినిమా చేయకూడదని అటు ఎన్టీఆర్ తో పాటు ఇటు రామ్ చరణ్ కూడా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం, జూన్ లో రామ్ చరణ్ తదుపరి సినిమా వర్క్ మొదలవుతుందని అంటున్నారు. 

 

ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు వంటి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ని తీసి సక్సెస్ ని అందుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చరణ్ తన తదుపరి సినిమాని చేయనున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం మెగాస్టార్ ఇంటి వద్ద చరణ్ ని కలిసిన అనిల్, తన వద్ద ఉన్న ఒక స్టోరీ లైన్ ని చరణ్ కి వినిపించారని, అయితే ఆ లైన్ ఎంతో నచ్చిన చరణ్, ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన తరువాత చేద్దాం అని అన్నారట. ఈలోపు దాని పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం అనిల్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే మరి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: