పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్, ఆ తరువాత పవన్ తో కలిసి జానీ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది, ఇక అనంతరం పవన్ కళ్యాణ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న రేణు, ఏడేళ్ల క్రితం ఆయన నుండి విడిపోయారు. ఇక అప్పటినుండి కొడుకు అక్రీరానందన్, కూతరు ఆద్య లతో కలిసి విడిగా ఉంటున్న రేణు, తన స్వశక్తితో పైకి రావాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇద్దరు బిడ్డలకు తల్లిని అయినప్పటికీ, తనకంటూ కొంత ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకునే రేణు దేశాయ్, ఇటీవల మరాఠీలో ఇష్క్ వాలా లవ్ అనే సినిమాకు దర్శకత్వం వహించి మంచి పేరు దక్కించుకున్నారు. వాస్తవానికి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో రేణు ఒక ముఖ్య పాత్రలో నటించాల్సి ఉంది. 

 

అయితే ఆ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు, కాగా రేణు కూడా ఆ సినిమాలో నటిస్తున్నట్లు అప్పట్లో చెప్పారు. అయితే ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వలన ఆమె ఆ సినిమా నుండి తప్పుకోవడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం యువ నటుడు శివ కందుకూరి హీరోగా రాజ్ కందుకూరి నిర్మాతగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'చూసి చూడంగానే' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది .ఇక ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రేణు దేశాయ్, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనకు నిర్మాత రాజ్ గారితో మంచి అనుబంధం ఉందని, వాస్తవానికి తాను కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాల్సి ఉందని, అయితే అదే సమయంలో తనకు అనారోగ్యం కారణంగా ఆ పాత్రలో నటించలేకపోయానని రేణు అన్నారు. 

 

రాజ్ గారు వ్యక్తిత్వంలో ఎంతో గొప్ప మనిషి అని, స్త్రీలను ఎంతో గొప్పగా గౌరవించే మంచి మనసున్న ఆయన సినిమాలో నటించడానికి ఎవరైనా ముందుకు వస్తారని, ఆయనతో ఉంటె ఎంతో సేఫ్ గా ఉంటుందని ఆమె అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చే లేడీ టెక్నీషియన్స్, లేడీ దర్శకుల వంటి వారు ధైర్యంగా ముందుకు రావాలని, అలానే వారికి ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని రేణు సూచించారు. ఇక ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని సినిమా యూనిట్ కి ముందస్తు అభినందనలు తెలిపారు రేణు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: