శంకరాభరణం ఈ చిత్రం వచ్చి నేటికి నాలుగు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం గురించి తెలియని వారుండరు. ఇప్పటి తరానికి ఈ సినిమా గురించి ఎంతైనా తెలియాల్సిన అవసరం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రాల్లో మొదటి వరుసలో ఉండే చిత్రం ఈ శంకరాభరణం. హీరోలు విలన్లు హీరోయిన్లు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమాని కథ, కథనం, బలమైన పాత్రలవైపు నడిపించింది ఈ చిత్రం. ఈ సినిమా చూసాక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వారు కోకొల్లలు.
అంటే ఈ సినిమా సంగీతానికి ఎంత ప్రాణం పోసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకి కె.వి. మహదేవన్ సమకూర్చిన సంగీత ప్రాణంగా ఈ చిత్రం నిలిచింది. అప్పటి వరకు ఈ విషయం పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు.. కానీ సంగీతం సినిమాకు ప్రాణం అని ఫ్రూవ్ చేసింది ఈ సినిమాతోనే మహదేవన్ సినిమాతో పాటు జంధ్యాల మాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం గానం ఇక కె.విశ్వానాథ్ డైరెక్షన్ ఈ సినిమాకి ఆయువుపట్టు అయ్యాయి. అప్పట్లో దూరదర్శన్ ఛానల్లో ప్రతి శుక్రవారం వచ్చే చిత్రలహరిలో ఈ పాటలే ఎక్కువ ఉండేవి. ఈ పాటలు వింటే గొంతులో తేనె పోసినంత తియ్యగా ఎంతో అద్భుతంగా రచించారు.
ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు కేవలం ఒక్క ధియేటర్ లో నే మాత్రమే విడుదలైంది, అది కూడా దాదాపు ఖాళీ. తర్వాతి రోజు నుండి 1980 లో తెలుగు చిత్రాల్లో అత్యంత ఆదరణ పొందిన చిత్రం గా అవతరించింది. అప్పటి ప్రఖ్యాత సమీక్షకుడు గుడిపాటి శ్రీహరి గారు “మాయా బజార్ తర్వాత అంతటి గొప్ప తెలుగు చిత్రం” అంటూ ఈ చిత్రానికి ప్రశంసలు అందించారు. సినిమా స్థాయిని పెంచే దర్శకులు చాలా మంది ఉంటారు, కాని ప్రేక్షకుడి స్థాయిని పెంచే దర్శకులు మాత్రం కొందరే ఉంటారు. మన పరిశ్రమలో ఉన్న ఆ స్థాయి దర్శకుడు కాశీనాధుని విశ్వనాధ్ (K. విశ్వనాధ్) గారే ఈ చిత్ర దర్శకులు అని చెప్పాలి.