ప్రేమ, పెళ్లి, విడాకులు అంశాలను చర్చించేలా ఓ మై కడవులే సినిమా ఉంటుందని ఆ సినిమా నిర్మాత ఢిల్లీబాబు చెప్పారు. గతంలో రాక్షసన్‌ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ఆయన తాజాగా నిర్మిస్తున్న చిత్రమే ఓ మై కడవులే. ఈ సినిమాకు నిర్మాతలుగా అశోక్‌ సెల్వన్, అభినయ సెల్వన్‌ వ్యవహరిస్తుండగా, అశ్వత్ మారిముత్తు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈయన గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్ లను రూపొందించారు. ఈ సినిమాలో నటుడు విజయ్‌సేతుపతి ఓ ముఖ్యమైన పాత్రలో నటించగా, అశోక్‌సెల్వన్, రితికా సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. నటి వాణీబోజన్‌ కూడా మరో ప్రధాన పాత్రలో నటించారు. దర్శకుడు గౌతమ్‌మీనన్‌ మరో కీలక పాత్రలో నటించడం మరో విశేషం.

 

నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు చెప్పిన కథ నచ్చడంతో ఒక్క గంటలోనే సినిమా తీసేందుకు ఓకే అన్నానని చెప్పారు. ప్రేమ, వినోదం వంటి యూనిక్‌ కథతో రూపొందించినది ఈ చిత్రం అని తెలిపారు. నటుడు విజయ్‌సేతుపతి ఇందులో చాలా ముఖ్యమైన పాత్రలో నటించినట్లు చెప్పారు. తర్వాత డైరెక్టర్ మాట్లాడుతూ ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు సూర్య చేతుల మీదగా రిలీజ్ చేశామని, ఒక్క గంటలోనే మిలియన్ వ్యూస్ వచ్చాయన్నారు. 

 

ఈ చిత్ర కథపై 2013లోనే తనకు ఐడియా వచ్చిందన్నారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడుతాయని అంటారని, కానీ అలాంటివి విడాకులకు ఎందుకు దారి తీస్తున్నాయన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు. ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటించడానికి రియల్, రీల్ లైఫ్ హీరో అవసరం కాగా, నటుడు విజయ్‌సేతుపతినికలిసినట్లు చెప్పారు. కథ విన్న ఆయన ఈ పాత్ర తానే చేయాలని చెప్పారన్నారు. ఈ సినిమాను అందరూ రిలేట్‌ చేసుకుంటారని చెప్పారు. ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్‌మీనన్‌ తన రియల్‌ పాత్రనే పోషిస్తున్నారని చెప్పారు. చిత్ర తమిళనాడు విడుదల హక్కులను శక్తిఫిలిం ఫ్యాక్టరీ శక్తివేల్‌ తీసుకున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: