టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తండ్రి అక్కినేని నాగార్జున, తాత అక్కినేని నాగేశ్వర రావుల నట వారసత్వంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్, నిజానికి తొలిసారిగా చిన్నప్పుడే వెండి తెరపై కనపడడం జరిగింది. నాగార్జున హీరోగా వచ్చిన సిసింద్రీ సినిమాలో బాలనటుడిగా నటించిన అఖిల్, పెరిగి పెద్దయ్యాక అఖిల్ సినిమా ద్వారా హీరోగా లాంచ్ అయ్యాడు. వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఆ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అఖిల్ కి నిరాశని మిగిల్చింది. అయితే రెండవ సినిమా హలో తో కూడా పెద్దగా విజయం అందుకోని అఖిల్, ఇటీవల మజ్ను గా ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అది కూడా అంత మంచి విజయాన్ని అందించలేకపోయింది. 

 

ఇక దానితో కొంత ఆలోచనలో పడ్డ అఖిల్, తన తదుపరి సినిమాని ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మొదలెట్టాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అని నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో అఖిల్ పాత్ర ఎంతో బాగుంటుందని, తప్పకుండా సినిమా మంచి సక్సెస్ సాదిస్తుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. 

 

సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తో పాటు మంచి రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి ముందుకు సాగుతుందని అంటున్నారు. యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ లో మాత్రం విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు సరైన హిట్ లేని అఖిల్ కి తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందించడం ఖాయం అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అఖిల్ ఎంత మేర సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: