పెంపుడు జంతువులను కొంతమంది వారి ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తారు. వాటికి చిన్న ఆపద వచ్చినా వెంటనే చలించిపోతారు. అదే కోవలోకి వస్తాడు 'వెదర్ టెక్' అనే కార్ల విడిభాగాల తయారీ సంస్థ యొక్క సీఈఓ డేవిడ్ మ్యాక్ నైల్. తాజాగా అతని పెంపుడు కుక్క కు తీవ్రమైన అనారోగ్యం చేసింది. అయితే దాని ప్రాణాలను కాపాడిన వెటర్నరీ డాక్టర్లకు కేవలం ధన్యవాదాలు తెలిపేందుకే అతను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అసలు ఇంతకీ అతని కుక్క కి వచ్చిన ప్రమాదం ఏమిటి…. డేవిడ్ ఏ విధంగా దాని ప్రాణాలను కాపాడిన వారి రుణం తీర్చుకున్నాడో ఒక సారి చూద్దాం....
గోల్డెన్ రిట్రీవర్ అనే జాతి కుక్క ను పెంచుకుంటున్న డేవిడ్ మ్యాక్ నైల్ దానిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు. స్కౌట్ అని డేవిడ్ ఆ కుక్క ని ఆప్యాయంగా పిలుచుకుంటాడు కూడా. అయితే స్కౌట్ గత యేడాది తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే దాని గుండెలో ఒక గడ్డ ఉందని మరియు రక్తంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని కూడా డాక్టర్లు చెప్పడంతో అతను షాక్ కు గురి అయ్యాడు. అంతేకాకుండా స్కౌట్ బ్రతికే అవకాశాలు కేవలం ఒక్క శాతమే ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో డేవిడ్ కు ఏం చేయాలో పాలుపోలేదు.
అయినా డేవిడ్.... స్కౌట్ ను యూనివర్సిటీ ఆఫ్ విస్కోన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ లో చేర్పించాడు అక్కడ డాక్టర్లు దానికి కీమోథెరపీ రేడియేషన్ థెరపీ మరియు ఇమ్యూనో థెరపీ అందించడం ద్వారా స్కౌట్ గుండెలోని గడ్డ 90 శాతానికి కరిగిపోయి ఆరోగ్యం మెరుగు పడింది. దీంతో ‘యూనివర్శిటీ ఆఫ్ విస్కోన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్’ డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పేందుకు డెవిడ్ మ్యాక్నైల్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.
అమెరికాలోని సూపర్ బౌల్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో ప్రకటన కోసం రూ.42,93,63,000 ఖర్చుపెట్టారు. కుక్కల్లో ఏర్పడే క్యాన్సర్ గురించి అవగాహన కలిపిస్తూ రూపొందించిన ఈ ప్రకటనలో స్కౌట్కు అందించిన చికిత్స గురించి తెలిపారు. ఈ ప్రకటన ద్వారా ఆ వెటర్నరీ స్కూల్కు విరాళాలు లభిస్తాయని ఆశిస్తున్నానని డెవిడ్ మ్యాక్నైల్ పేర్కొన్నారు.