రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్ వస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. అంతేగాక ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్, అందాల తార శ్రీయ, నటి అలియా భట్, కిచ్చ సుదీప్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. తెలుగు లో మునుపెన్నడూ లేని మల్టీ స్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులు.. ఇటు రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్ .. చరణ్ జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను జరుపుకుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగు మధ్యలో ఏర్పడిన కొన్ని అంతరాయాల వల్ల.. సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపించింది. తాజాగా ఆ వార్త నిజమేనన్నట్టుగా ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది.
ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా ఆరు నెలల పాటు త్రిబుల్ ఆర్ సినిమా వాయిదా వేశాడు. జూలై 30వ తేదీ నుంచి 2021 జనవరి 8 కి ఈ సినిమాను పోస్ట్ ఫోన్ చేశాడు దర్శక ధీరుడు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో అనౌన్స్ చేశాడు. ఇది చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అనుకున్న సమయానికి సినిమా తీసుకు రావడం కంటే క్వాలిటీ ఔట్ పుట్ తీసుకురావడం తనకు ముఖ్యం అంటున్నాడు రాజమౌళి. అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే కానీ తప్పదని జక్కన్న అంటున్నాడు.